చైనా సహా కొన్ని దేశాల్లో కోవిడ్ 19 కేసులు భారీగా పెరుగుతున్నందున ఇండియా ఇప్పటికే అప్రమత్తమైంది. తాజాగా ఆరు దేశాల్నించి వచ్చే ప్రయాణీకులకు ముందస్తు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ మహమ్మారి మరోసారి ముంచుకొస్తోంది. చైనా సహా ప్రపంచదేశాల్ని ఇప్పటికే వణికిస్తోంది. ఈ క్రమంలో భారతదేశం అప్రమత్తంగా ఉంటోంది. తాజాగా ఆరు దేశాల్నించి వచ్చే ప్రయాణీకులకు ముందస్తు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. ఈ పరీక్షల్ని ప్రయాణానికి 72 గంటల్లోపు చేయించాల్సి ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. చైనా, సింగపూర్, హాంగ్కాంగ్, కొరియా, థాయ్లాండ్, జపాన్ దేశాల్నించి వచ్చే ప్రయాణీకులు ముందస్తు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవల్సి ఉంటుంది.
ఈ దేశాల్లో కోవిడ్ ముప్పుని దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న మార్గదర్శకాల్ని సమీక్షించాలని తెలిపింది. రివైజ్డ్ మార్గదర్శకాల ప్రకారం ఇక నుంచి ఈ ఆరు దేశాల్నించి వచ్చే ప్రయాణీకులు ప్రయాణానికి 72 గంటల ముందు చేయించిన ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఆరు దేశాల్నించి వచ్చే ప్రయాణీకులు ఏ దేశానికి చెందినవారైనా ఈ పరీక్షలు తప్పకుండా చేయించాల్సిందే. దీనికోసం ఇప్పటికే ఎయిర్ సువిధ పోర్టల్ అందుబాటులో ఉంచారు. ముందస్తు నెగెటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టులతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాల్ని పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు విదేశాల్నించి వచ్చే ప్రయాణీకుల్లో ర్యాండమ్ పద్ధతిలో 2 శాతం ప్రయాణీకులకు చేస్తున్న పరీక్షలు కొనసాగుతాయి. దేశంలోని పౌర విమానయాన శాఖ ప్రయాణీకుల సౌకర్యం, రక్షణార్ధం ఆగస్టు 2020లో ఎయిర్ సువిధ పోర్టల్ ప్రారంభించింది. ఇండియాకు వచ్చే ప్రయాణీకులు తప్పకుండా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది.
