ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని సెటైర్లు వేయడంలో సిద్ఙహస్తులు. బీఆర్ఎస్గా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి..ఏపీలో కూడా విస్తరించడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత వ్యంగ్యంగా మాట్లాడారంటే.. ఏపీలో కొందరు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఆ పార్టీ రాష్ట్రంలో విస్తరించేందుకు సిద్ధమవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీ చేయడంపై ఆయన స్పందించారు. కేఏ పాల్
పార్టీ కూడా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తోందని..అలాంటిది బీఆర్ఎస్ పోటీ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. అంటే బీఆర్ఎస్ పార్టీని కేఏ పాల్ పార్టీతో పోల్చేశారు పేర్ని నాని. ఏపీలో కేసీఆర్ ఏం చేస్తారు, ఏపీని వాళ్లు ఉద్దరించేదేంటని పేర్ని నాని ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో దొంగ కరెంట్ తీసుకోవడం లేదా, ఏపీకు వెన్నుపోటు పొడుస్తున్నదెవరు, కాస్తైనా సిగ్గుండాలి కదా అని పేర్ని నాని మండిపడ్డారు. మా ఆస్తులు మాకు పంచివ్వకుండా మోసం చేశారని, విద్యుత్ బకాయిలు కూడా చెల్లించలేదని దుయ్యబట్టారు. మరోవైపు ఇదే అంశంపై మంత్రి రోజా సైతం స్పందించారు. పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చని చెప్పారు. కానీ ఏపీ విభజన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని..ఏపీకి రావల్సిన బకాయిలపై బీఆర్ఎస్ నేతలు ముందు సమాధానం చెప్పాలన్నారు.
