Latest Posts

పంత్‌ యాక్సిడెంట్‌పై కపిల్‌ ఘాటు వ్యాఖ్యలు

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గత శుక్రవారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసు కదా. తన కారులో ఢిల్లీ నుంచి హరిద్వార్‌ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పంత్ కారు పూర్తిగా మంటల్లో కాలిపోగా.. అతడు అదృష్టవశాత్తూ గాయాలతో బయటపడ్డాడు. డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో అతడు చికిత్స పొందుతున్నాడు. అతనికి ప్లాస్టిక్‌ సర్జరీ విజయవంతం కాగా.. సోమవారం (జనవరి 2) ప్రైవేట్‌ వార్డులోకి షిఫ్ట్‌ చేశారు. అయితే ఈ ప్రమాదంపై క్రికెట్‌ ప్రపంచమంతా ఒకలా స్పందించగా.. మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ మాత్రం కాస్త భిన్నంగా రియాక్ట్‌ అయ్యాడు. ఇదొక పాఠం కావాలని అతడు అనడం గమనార్హం. “ఇదొక గుణపాఠం. నేను క్రికెట్‌ ఆడుతున్న కొత్తలో ఓ మోటార్‌ సైకిల్ ప్రమాదానికి గురయ్యాను. అప్పటి నుంచి నా సోదరుడు నన్ను కనీసం బైక్‌ను ముట్టుకోనివ్వలేదు.

రిషబ్‌ పంత్‌ సురక్షితంగా బయటపడినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు” అని కపిల్‌ ఏబీపీ న్యూస్‌తో చెప్పాడు. క్రికెటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, డ్రైవింగ్‌ కోసం ప్రత్యేకంగా ఓ డ్రైవర్‌ను పెట్టుకోవడం వాళ్లకు పెద్ద కష్టమైన పనేమీ కాదని అన్నాడు. “నిజమే. మీ దగ్గర మంచి కారు ఉండొచ్చు. మంచి స్పీడుతో వెళ్తుండొచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సులువుగా ఓ డ్రైవర్‌ను పెట్టుకోగలరు. మీకు మీరుగా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేదు. కొందరికి ఈ అలవాట్లు, అభిరుచులు ఉండొచ్చు. ఈ వయసులో అది సహజమే. కానీ మీపై బాధ్యతలు కూడా ఉన్నాయి. మిమ్మల్ని మీరు మాత్రమే జాగ్రత్తగా చూసుకోగలరు. మీకు మీరే నిర్ణయాలు తీసుకోవాలి” అని కపిల్‌ దేవ్‌ అన్నాడు. ఈ ప్రమాదంలో పంత్‌ ప్రాణాలతో బయటపడటం నిజంగా అదృష్టమే అని చెప్పాలి. హర్యానా రోడ్‌ ట్రావెల్‌కు చెందిన బస్సు డ్రైవర్‌ సుశీల్ మాన్‌, ఆ బస్సు కండక్టర్‌ పంత్‌ను కాపాడటంతో కీలకపాత్ర పోషించారు. వాళ్లను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఘనంగా సన్మానించాలని నిర్ణయించడం విశేషం.

Editor