కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రతాపం చూపిస్తుండటంతో ప్రయాణీకులు కొన్ని దేశాలకు న్యూ ఇయర్ ట్రిప్స్ మానుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందులో ముఖ్యంగా 8 దేశాలకు వెళ్లకుండా ఉంచే మంచిదని తెలుస్తోంది. కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతున్న చైనాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకుండా ఉండాలి. డిసెంబర్ తొలి 20 రోజుల్లో 18 శాతం చైనా జనాభా అంటే 250 మిలియన్ల మందికి కరోనా సోకిందంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశ రాజధాని బీజింగ్లో పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఇండియా సహా చాలా దేశాలు ఇప్పటికే చైనా నుంచి వచ్చే ప్రయాణీకులకు స్క్రీనింగ్ చేయడం మొదలెట్టాయి. జపాన్లో ప్రస్తుతం రోజుకు 2 లక్షల కోవిడ్ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అందుకే మీ ట్రావెల్ జాబితాలో జపాన్ పేరు తొలగించండి. జపాన్ ఆరోగ్యశాఖ ప్రకారం ఒక్కరోజులో అత్యధికంగా 371 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. 2020లో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం.
జపాన్లో ప్రస్తుతం కరోనా 8వ వేవ్ నడుస్తోంది. అటు అమెరికాలో కూడా కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గత 28 రోజుల్లో దేశంలో 15 లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 21 నాటికి మొత్తం కరోనా కేసులు దేశంలో 100 మిలియన్స్ దాటేశాయి. ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వి కేసులు అమెరికాలో పెరుగుతుండటంతో అమెరికా ఆరోగ్య శాఖ దీనిని ట్రిపుల్ డెమిక్ గా పిలుస్తోంది. ఇక దక్షిణ కొరియాలో డిసెంబర్ 23న ఒకే రోజు 68 వేల కేసులు నమోదయ్యాయి. క్రిస్మస్ వీకెండ్ సందర్భంగా కరోనా నిర్ధారణ పరీక్షలు తగ్గించడంతో కోవిడ్ 19 కేసులు 30 వేలలోపు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 25, 545 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 67 విదేశాలకు చెందినవి. బ్రెజిల్లో సైతం కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అటు జర్మనీలో కూడా ఇదే పరిస్థితి. రోజుకు 40 వేల కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్లో గత 28 రోజు్లో 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక సింగపూర్లో గత 3 నెలల వ్యవధిలో 130 ఒమిక్రాన్ సబ్లైనేజ్ కేసులు గుర్తించారు. ఇందులో కొన్ని BQ.1, XBB కేసులున్నాయి. ఇక ఇండియాలో రోజులో అత్యధికంగా 157 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.46 కోట్లకు చేరుకుంది. మరణాల సంఖ్య 5,30,696కు చేరుకుంది. రోజువారీ పాజిటివ్ రేటు 0.32 శాతం ఉండగా వీక్లీ పాజిటివ్ రేటు 0.18 శాతముంది.
