భారత్లో కరోనాకు సంబంధించి రాబోయే 40 రోజులు చాలా ముఖ్యమైనవిగా మారనున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జనవరిలో భారతదేశంలో కూడా కరోనా కేసుల పెరుగుదల నమోదవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
ఈ విషయాన్ని బుధవారం అధికారిక వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కోవిడ్ -19 యొక్క ఏ కొత్త వేవ్ అయినా తూర్పు ఆసియాకు వచ్చిన 30-35 రోజుల తర్వాత భారతదేశానికి వస్తుందని ఇంతకుముందు గమనించినట్లు ఒక కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు.
ఇక అంతేకాక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి కరోనా వైరస్ సంక్రమణ అంత తీవ్రంగా ఉండదని అంటున్నారు. ఇక ఇప్పుడు కొత్త వేవ్ వచ్చినప్పటికీ, మరణాల రేటు అలాగే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇక చైనాతో సహా ప్రపంచంలోని కొన్ని దేశాలలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది, అన్ని పరిస్థితుల కోసం సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది.
అంతేకాక కోవిడ్ కేసుల పెరుగుదలను ఎదుర్కోవడానికి సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ సహ ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అనేక సమావేశాలు నిర్వహించారు. కరోనా యొక్క ఓమైక్రాన్ వేరియంట్ లోని BF.7 రకం కారణంగా అనేక దేశాల్లో కేసులు వేగంగా నమోదయ్యాయి. BF.7 వ్యాప్తి రేటు చాలా ఎక్కువగా ఉందని, ఈ రకం వైరస్ సోకిన వ్యక్తి ద్వారా 16 మందికి సోకవచ్చని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్క మరణం కూడా జరగలేదు.
ఇక ప్రస్తుతం మన దేశంలో 3468 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి, ఇది మొత్తం కేసులలో 0.01 శాతం మాత్రమే. ఇక గత 24 గంటల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 47కు పెరిగింది. దేశంలో రోగుల కోలుకునే రేటు 98.80 శాతంగా ఉండగా రోజువారీ పాజిటివిటి రేటు 0.14 శాతంగా ఉంది. కరోనా సవాళ్లను ఎదుర్కోవడానికి మన ఆరోగ్య వ్యవస్థ ఎంతవరకు సిద్ధంగా ఉందో చూడటానికి దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలలో మాక్ డ్రిల్స్ కూడా ఇటీవల నిర్వహించారు.
కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా చైనా నుండి వెలువడుతున్న భయానక ఫోటోలు, వీడియోలు దృష్ట్యా మా సంసిద్ధతను అంచనా వేయడం అవసరమని భావించామని కేంద్రం చెబుతోంది. గత రెండు మూడు రోజుల్లో 6 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులను పరీక్షించగా, వారిలో 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి సమీక్షించనున్నారు.
