రైతును రాజును చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకంను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రైతుబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయంగా.. వానకాలం, యాసంగి కలిపి ఎకరానికి రూ.10 వేలను ఉచితంగా అందిస్తోంది. ఈ యాసంగి సీజన్లో 70.54 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం బుధవారం (డిసెంబర్ 28) నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. చెప్పినట్టుగానే కాసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. యాసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న పదో విడత రైతుబంధు నగదును బుధవారం ఉదయం తెలంగాణ ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది.
తొలి రోజున 1 ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతులకు ఇప్పటికే వారి అకౌంట్లలో 607.32 కోట్లు జమ చేయబడ్డాయి. అర్హులైన అందరి ఖాతాల్లో ఎకారకు రూ. 5వేల చొప్పున డబ్బులను జమ చేశారు. సంక్రాంతి 2023 కల్లా రైతులందరి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. నేటి నుంచి ప్రారంభమయ్యే పదో విడత రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్లో 70.54 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. గత యాసంగి సీజన్ కంటే.. ఈసారి ఎక్కువ మంది రైతులు రైతుబంధును అందుకోబోతున్నారు. డిసెంబర్ 20వ తేదీ నాటికి కొత్తగా భూములు కొన్న రైతులకు కూడా రైతుబంధు వర్తిస్తుంది. కొత్తగా భూములు కొన్న రైతులు తమ పట్టాదారు పాస్ బుక్కులతో 2023 జనవరి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకొంటే.. రైతుబంధు సాయాన్ని పొందవచ్చు. మొత్తంగా రూ.7,676 కోట్ల రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందించనున్నది. గత వానకాలం సీజన్లో రైతుబంధు సాయం 65 లక్షల మంది రైతులకు (రూ.7,434 కోట్లు) తెలంగాణ ప్రభుత్వం అందించింది.
