కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రకోపం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్ని అలర్ట్ చేసింది. ఆ వివరాలు మీ కోసం.. ప్రపంచంలో కరోనా వైరస్ కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికా, చైనా దేశాల్లో కోవిడ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో వారానికి 12 వందల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సూఖ్ మాండవియా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో నమోదవుతున్న కేసుల, పరీక్షలు జరుగుతున్న తీరుపై అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే పరీక్షల సంఖ్య పెంచాలన్నారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..మనోదైర్యంతో ఉండాలని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా..నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రమాదం పొంచి ఉందంటున్నారు. చైనా దేశంలో లాక్డౌన్ తొలగించాక పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇప్పుడా దేశంలో నిబంధనలు మరోసారి కఠినతరం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రెండేళ్ల నాటి పరిస్థితులు తప్పవని రాష్ట్రాల్ని హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుుడు జారీ చేసే మార్గదర్శకాల్ని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరారు.
