: రేషన్ కార్డుదారులకు త్వరలోనే గుడ్న్యూస్ అందే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పథకాన్ని పొడగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో పీఎంజీకేఏవై పథకాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రతి నెలా 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందుతాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద వారికి అత్యంత సబ్సిడీ ధరకు ఇచ్చే పరిమాణానికి ఇది అదనం. కరోనా ప్రభావం నుంచి పేదలను ఆదుకునేందుకు ఏప్రిల్ 2020లో ఈ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోసం మొత్తం 3.9 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఈ పథకాన్ని మార్చి 2023 వరకు పొడిగిస్తే సబ్సిడీ బిల్లుకు మరో రూ.40 వేల కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని వర్గాలు తెలిపాయి. అయితే ఈ పథకం కొనసాగించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఆర్థిక భారం ఒక అంశం అయితే.. అవసరాలకు సరిపడా గోధుమ నిల్వలు లేకపోవడం ఇబ్బందిగా మారనుంది.
ఎన్ఎఫ్ఎస్ఏ, ఇతర సంక్షేమ పథకాల కేటాయింపుతోపాటు పీఎంజీకేఏ కోసం అదనపు అవసరాలకు సరిపడా గోధుమలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం.. జనవరి 1, 2023 వరకు సెంట్రల్ పూల్లో దాదాపు 159 లక్షల టన్నుల గోధుమలు అందుబాటులో ఉంటాయి. PMGKAYని మార్చి వరకు పొడిగిస్తే.. జనవరి, మార్చి 2023 మధ్య మరో 68 లక్షల టన్నుల గోధుమలను పంపిణీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఏప్రిల్ 1 వరకు ప్రభుత్వం వద్ద మొత్తం 91 లక్షల టన్నుల గోధుమలు నిల్వ ఉండనున్నాయి. ప్రభుత్వ స్టాక్ నుంచి గోధుమలను బహిరంగ మార్కెట్లో విక్రయించే అవకాశం ఉండదని ఒక అధికారి తెలిపారు. పీఎంజీకేఏవైపై ప్రభుత్వ నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్సీఐ బహిరంగ మార్కెట్లో గోధుమ స్టాక్ను అందిస్తుందా లేదా అనేది ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. కరోనా మొదటి వేవ్ ముగియడంతో ఈ పథకం నవంబర్ 2020లో ఆపేశారు. మళ్లీ రెండో వేవ్ కరోనా కారణంగా ఈ పథకం మళ్లీ మే 2021లో ప్రారంభించారు. ఈ పథకం వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతోంది.
