Latest Posts

అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైన్యం మధ్య హింసాత్మక ఘర్షణ

అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైన్యం మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 30 మంది భారత సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ హింసాత్మక ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటులో కీలక ప్రకటన ఇవ్వనున్నారు. మంగళవారం ఉదయం ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. తవాంగ్ హింసాత్మక ఘర్షణపై భేటీలో చర్చించారు.

ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ మనోజ్ పాండ్‌తో పాటు నేవీ చీఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా ఉన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్, సీడీఎస్ ముకుంద్ నరవాణే కూడా పాల్గొన్నారు. సరిహద్దులో భారత్, చైనాల ప్రస్తుత పరిస్థితులపై సమావేశంలో చర్చించారు. లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు.. రాజ్యసభలో 2 గంటలకు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేయబోతున్నారు. తవాంగ్ ఘటనపై సభలో చర్చించాలని గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. దేశ భద్రత విషయంలో మనం ఐక్యంగా ఉందామని.. అయితే ప్రభుత్వం నిజాయితీగా ఉండాలని అన్నారు.

పార్లమెంటులో చర్చించి మోదీ ప్రభుత్వం దేశాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తన అలసత్వ వైఖరిని విడిచిపెట్టి.. ఇలాంటి చర్యను సహించేది లేదని చైనాకు కఠినమైన స్వరంతో హెచ్చరికలు పంపించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసీ) సమీపంలో ఒక ప్రదేశంలో భారత, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో రెండు దేశాల సైనికులు స్వల్ప గాయాల పాలయ్యారు. భారత దళాలు చైనా దళాలకు గట్టిగా సమాధానం చెప్పాయి. దేశవ్యాప్తంగా అందరూ రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

Editor