దేశ రాజకీయాల్లో మరో అపూర్వ ఘట్టానికి నేడు తెరలేవబోతోంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ సీఎం, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కేసీఆర్ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంను బుధవారం మధ్యాహ్నం 12.47 గంటలకు కేసీఆర్ ప్రారంభించనున్నారు. ముందుగా బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
అనంతరం కేసీఆర్ తన ఛాంబర్కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ సెంట్రల్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనాలని ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలందరినీ పార్టీ అధినేత కేసీఆర్ ఢిల్లీకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొందరు ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా.. ముఖ్యమైనవారు హస్తినకు చేరుకున్నారు. అయితే సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంబోత్సవానికి హాజారుకాలేకపోతున్నారు. ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన పెట్టుబడి సమావేశాల నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లలేకపోతున్నారు.
కీలక సమావేశాల నేపథ్యంలో ఈ ఉదయం ఢిల్లీ చేరుకోవాల్సిన కేటీఆర్.. సీఎం ప్రత్యేక అనుమతి తీసుకున్నారట. ప్రఖ్యాత వాహన దిగ్గజం మారుతి సుజుకికి చెందిన అంతర్జాతీయ విభాగాల అధిపతులతో నేడు మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. మంత్రితో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు ఇప్పటికే సుజుకి ప్రతినిధి బృందం హైదరాబాద్ చేరుకుంది. సమయపాలన, షెడ్యూలింగ్ వంటి విషయాలకు జపాన్ కంపెనీలు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయన్న విషయం తెలిసిందే. జపాన్కు చెందిన సుజుకి కంపెనీతో గత కొంతకాలంగా విస్తృతంగా పెట్టుబడి సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇక ఉదయం 10.45కు సలార్పురియా నాలెడ్జ్ పార్కులో బాష్ (Bosch) ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం ఉంది.
