చైనా-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. భారత్తో తమ సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సరిహద్దు వివాదంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధికారులను చైనా హెచ్చరించినట్లు కాంగ్రెస్లో పెంటగాన్ సమర్పించిన నివేదికలో ఈ సమాచారాన్ని వెల్లడించింది. భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి కొనసాతుగున్న ప్రతిష్టంభన తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ) అధికారులు చెప్పినట్లు ఈ నివేదికలో వెల్లడించారు. అమెరికా జోక్యం తనకు నచ్చకపోవడానికి ఇదే కారణం. సరిహద్దులో సుస్థిరతను నెలకొల్పడం, ప్రతిష్టంభన కారణంగా భారత్తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలతో ఇతర ప్రాంతాలకు నష్టం జరగకుండా చూడాలన్నది చైనా ఉద్దేశని నివేదికలో పేర్కొన్నారు. మే 2020లో తూర్పు లడఖ్లోకి చైనా సైన్యం చొచ్చుకువచ్చిన విషయం తెలిసిందే.
చైనా దాడులకు భారత్ దీటుగానే బదులిచ్చింది. దీంతో అప్పటి నుంచి చైనా-భారత్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించేందుకు రెండు దేశాల కార్ప్స్ కమాండర్ స్థాయి అధికారులు 16 సార్లు చర్చలు జరిపినా కొలిక్కిరాలేదు. 2021లో చైనా-భారత్ సరిహద్దు వెంబడి ఉన్న ఒక విభాగంలో పీఎల్ఏ సైనిక బలగాల మోహరింపును కొనసాగించిందని, వాస్తవాధీన రేఖ సమీపంలో మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని చైనా కొనసాగించిందని నివేదికలో వెల్లడించారు. చైనా-భారత్ మధ్య సరిహద్దులో రెండు దేశాలు కూడా తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు వ్యతిరేకిస్తున్నందున చర్చలలో కనీస పురోగతి లేదని పెంటగాన్ నివేదిక వెల్లడించింది. ప్రశాంతకు మారుపేరుగా ఉన్న గల్వాన్లో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడడంతో ఒక్కసారిగా పరిస్థితులు మొత్తం మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లోకి చైనా బలగాలు అక్రమంగా ప్రవేశించగా.. భారత్ సైన్యం బలంగా తిప్పికొట్టింది. ఆక్సాయీ చిన్ ప్రాంతాన్ని తమ ప్రాంతంగా మ్యాప్లో భారత్ చూపించడం చైనా ఆగ్రహానికి కారణమైంది. అప్పటి నుంచే బార్డర్ వద్ద చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది.
