జగనన్న క్రీడా సంబరాల సందర్భంగా కబడ్డీ ఆడిన మంత్రి రోజా

సినీ నటి, వైసీపీ మంత్రి ఆర్కే రోజా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో విద్యార్థులు రోజాను టాకిల్ చేయడంతో.. ఆమె లైన్ ఆవల వెళ్లకిలా కిందపడిపోయారు. టాకిల్ చేసిన విద్యార్థులు మంత్రి రోజాపై పడిపోయారు. దాంతో అక్కడున్న అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అలానేనా కిందపడేసేది అని అధికారులు విద్యార్థులను అంటుండగా.. మంత్రి లేచి తనకేమీ కాలేదని, ఎవరినీ ఏమనొద్దని చెప్పారు. ఆపై మంత్రి రోజా మరో రైడ్‌కు వెళ్లారు. చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను వైసీపీ మంత్రి ఆర్కే రోజా సోమవారం ప్రారంభించారు. ఈ పోటీలలో పలమనేరు, కుప్పం, చిత్తూరు, పూతలపట్టు, పుంగనూరు, నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా విద్యార్థులతో కలిసి పలు క్రీడలను ఆడి అలరించారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఆడి.. మహిళా విద్యార్థులను ఆమె ప్రోత్సహించారు.

మంత్రితో కలిసి విద్యార్థులు తెగ ఎంజాయ్ చేశారు. జగనన్న క్రీడా సంబరాల సందర్భంగా మంత్రి రోజా కబడ్డీ ఆడారు. రైడ్‌కు వెళ్లిన రోజాను అమ్మాయిలు టాకిల్ చేశారు. లైన్ వద్ద మంత్రిని పట్టునుకి బయటకు తోశారు. దాంతో ఆమె కిందపడిపోయారు. మంత్రిపై 2-3 ముగ్గురు విద్యార్థులు పడిపోయారు. తనకు ఏమీ కాలేదని చెప్పిన మంత్రి మళ్లీ కబడ్డీ ఆడారు. మరోసారి రైడ్‌కు వెళ్లిన రోజా.. సక్సెస్ కాలేకపోయారు. అయితే మంత్రి రోజా కిందపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన వారు రోజాను మెచ్చుకుంటున్నారు. అమ్మాయిలను ప్రోత్సహించిన తీరు బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. మంత్రి రోజా మాట్లాడుతూ… ‘డిసెంబర్ 21న సీఎం జగన్ గారి పుట్టినరోజు. సందర్భంగా పలు పోటీలను నిర్వహిస్తున్నాం. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మట్టిలో మాణిక్యాలు వెలికి తీసేందుకు ఇది గొప్ప అవకాశం. యువతకు చదువుతో పాటుగా క్రీడలు కూడా అవసరమే. క్రీడాకారులు గ్రామ సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక టీమ్ ఆడుతుంది. జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్లకు.. జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయిలో పోటీలు ఉంటాయి. డిసెంబర్ 21న విజేతలకు అవార్డులు అందిస్తాం’ అని చెప్పారు.

Editor