సమాజంలో హింసకు గురవుతున్న మహిళలకు అండగా నిలిచేందుకు ‘సఖి’ వన్ స్టాప్ సెంటర్ సిద్ధంగా ఉందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ అనంతరం ఆయన సఖి వన్ స్టాప్ సెంటర్ ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఆపదలో ఉన్న మహిళలు 181 ఉచిత నంబర్ను సంప్రదించాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సఖి కేంద్రం ద్వారా మహిళలకు ఉచితంగా కౌన్సిలింగ్, వైద్య, పోలీస్, న్యాయ సహాయంతో పాటు తాత్కాలిక వసతి కూడా కల్పిస్తామన్నారు. గృహ హింస లేదా ఇతర వేధింపులకు గురయ్యే మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, సీడీపీఓలు, సఖి కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలకు అండగా ‘సఖి’- కలెక్టర్ సుమిత్ కుమార్
