ఓటమే మెట్టుగా ఎదిగిన నవీన్ యాదవ్ రాజకీయ ప్రస్థానం: 4 అపజయాల తర్వాత ఘన విజయం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ ఘన విజయం దిశగా దూసుకుపోవడం వెనుక ఆయన సుదీర్ఘ పోరాటం, పట్టుదల ఉంది. 16 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో, గత పదేళ్ల వ్యవధిలో నాలుగు వరుస ఓటములను చవిచూసిన నవీన్ యాదవ్, తొలిసారిగా చారిత్రక విజయాన్ని అందుకున్నారు. నియోజకవర్గ ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేయడం, సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన విజయానికి కీలక అంశాలుగా నిలిచాయి.

నవీన్ యాదవ్ రాజకీయ ప్రస్థానం ఓటములతోనే మొదలైంది. ఆయన తొలిసారిగా 2009లో ఎంఐఎం పార్టీ నుంచి యూసుఫ్‌గూడ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. 2015లో మరోసారి రహ్మత్‌నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి వరుసగా ఓటములను ఎదుర్కొన్నారు.

అయితే, ఆయన ఏనాడూ నిరాశ చెందలేదు. పదేళ్ల వ్యవధిలో నాలుగు సార్లు ఓటమి పాలైనా, నియోజకవర్గ ప్రజలతో మమేకమై నవ యువ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి మంచి గుర్తింపు పొందారు. 2023లో అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆయన నిర్ణయం రాజకీయంగా కీలక మలుపుగా మారింది. మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, నియోజకవర్గంపై ఆయనకున్న దశాబ్దాల పట్టు, కాంగ్రెస్ పార్టీపై పెరుగుతున్న ప్రజాభిమానం కలగలిసి ఈ చారిత్రక విజయాన్ని అందించాయి.

Posted Under AP
Editor