ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇబ్రహీంపట్నం సెంట్రల్ జీఎస్టీ రేంజ్ కార్యాలయంలో అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా సీబీఐ అధికారులు ఓ సీజీఎస్టీ సూపరింటెండెంట్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సూపరింటెండెంట్ బానోతు మంగమ్మ ఓ ప్రైవేట్ సంస్థకు సంబంధించిన పన్ను బకాయిల వ్యవహారంలో డిమాండ్ నోటీసు జారీ చేయకుండా, కేసును పూర్తిగా ముగించేందుకు రూ.1.50 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆగస్టు 10న సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి ట్రాప్కు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా డిమాండ్ చేసిన లంచంలో తొలి విడతగా రూ.50 వేల నగదును ఫిర్యాదుదారుడి నుంచి స్వీకరిస్తున్న సమయంలో సీబీఐ బృందం మంగమ్మను పట్టుకుంది. అనంతరం లంచం నగదును స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
కేసు దర్యాప్తులో భాగంగా విజయవాడలోని మంగమ్మ నివాసంతో పాటు ఇతర అనుమానిత ప్రాంగణాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కేసుకు సంబంధించిన కీలక పత్రాలు, ఇతర ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
