రాయపూర్ శ్రీ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రిని సందర్శించిన ప్రధాని మోదీ: సద్గురు శ్రీ మధుసూదన్ సాయితో భేటీ

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా, ‘బిల్ కౌంటర్‌ ఊసేలేని ఆస్పత్రి’గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రులలో ఒకటైన రాయపూర్ శ్రీ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రిని సందర్శించారు. చిన్నపిల్లల గుండె సంబంధ శస్త్రచికిత్సలకు ప్రత్యేకమైన ఈ ఆస్పత్రిలో ఆపరేషన్లు పూర్తయి ఆరోగ్యంగా ఉన్న చిన్నారులతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా, వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రుల ఛైర్మన్ శ్రీనివాసన్ ప్రధానికి సత్యసాయి చిత్ర పటాన్ని అందజేశారు. ప్రధాని ముందుగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా విగ్రహానికి పూజలు నిర్వహించి, చికిత్సపొందిన చిన్నారులకు సర్టిఫికేట్లు అందజేశారు. ప్రముఖ క్రికెటర్, ఈ హాస్పిటల్స్ ట్రస్టీల్లో ఒకరైన సునీల్ గవాస్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రులు ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్’లో భాగమే. ఈ మిషన్ వందకు పైగా దేశాలలో వైద్యం, విద్య, పోషకాహార రంగాలలో సేవలు అందిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత పీడియాట్రిక్ కార్డియక్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్‌గా సంజీవనీ ఆస్పత్రులు గుర్తింపు పొందాయి. ఇప్పటివరకు ఈ ఆస్పత్రులలో 37 వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు అందించారు. అలాగే, ఈ మిషన్ దేశంలోనే మొట్టమొదటి ఉచిత ప్రైవేటు వైద్య కళాశాల, విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్వహిస్తోంది.

Editor