ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి రేపు (శనివారం) రాత్రి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్కు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో నవంబర్ 4న లండన్లో జరగనున్న గ్లోబల్ కన్వెన్షన్ సందర్భంగా నారా భువనేశ్వరి రెండు విశిష్ట గౌరవాలను అందుకోనున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ ఆమెను **’డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు – 2025’**కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం, మహిళా సాధికారిత రంగాల్లో ఆమె అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రకటించారు.
భువనేశ్వరి ఎండీగా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు కూడా ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ఆ సంస్థకు “ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్” విభాగంలో ‘గోల్డెన్ పీకాక్ అవార్డు – 2025’ లభించింది. ఎఫ్ఎంసీజీ రంగంలో పారదర్శక పాలన, నాణ్యతా ప్రమాణాలు, సామాజిక బాధ్యత వంటి అంశాలను సమగ్రంగా అమలు చేస్తున్నందుకు ఈ గౌరవం దక్కింది. గతంలో ఈ అవార్డును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, గోపిచంద్ హిందూజా వంటి ప్రముఖులు అందుకున్నారు. భువనేశ్వరి ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం తెలుగు మహిళా నాయకత్వానికి గర్వకారణంగా మారింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనలో వ్యక్తిగత కార్యక్రమాలతో పాటు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆయన లండన్లోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను స్వయంగా కలిసి, నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించనున్నారు. అలాగే, ప్రవాసాంధ్రులతో కూడా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు దంపతులు తమ పర్యటనను ముగించుకుని నవంబర్ 6న తిరిగి స్వదేశానికి రానున్నారు.
