Latest Posts

కూటమి సర్కార్ బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తుంది..-:జగన్..

ఏపీలో కూటమి సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ సీఎం జగన్. కమిషన్ల కోసం కావాలనే ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌ను ప్రొత్సహిస్తోందని ఆరోపించారు. ఉల్లి విషయంలో రైతుకు ఇచ్చేది కేవలం ఆరు రూపాయలు మాత్రమేనని, అదే ఉల్లి హెరిటేజ్‌లో రూ.35 లకు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు.

 

మంగళవారం పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలంలో రైతులను పరామర్శించారు మాజీ సీఎం జగన్. తాళ్ళపల్లె గ్రామంలో ఉల్లి, చీని పంటలను ఆయన పరిశీలించారు. రైతుల నుంచి సమాచారం తీసుకున్న ఆయన, మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు.

 

కనీసం కూలీ ఖర్చులు రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్ ను ప్రోత్సహించి, దాని ద్వారా కమిషన్లు తీసుకుంటోందని ఆరోపించారు. గిట్టుబాటు ధరకు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే ఉల్లి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో క్వింటాల్ ఉల్లి 4 వేల నుంచి 12 వేలు పలికిందన్నారు.

 

ప్రస్తుతం ఉల్లి ధర క్వింటాలు రూ. 800 పలుకుతోందని, గిట్టుబాటు ధర లేకపోవడం బాధాకరమన్నారు. వైసీపీ హయాంలో చీని ధరలు టన్ను 30 వేల నుంచి లక్ష వరకు పలికిందని, ప్రస్తుతం 6000 నుంచి 12 వేలకు కొనే పరిస్థితి లేదన్నారు. గతంలో అరటి టన్ను 30000 పలికిందని, ప్రస్తుతం 3 వేలకు పరిమితం అయ్యిందన్నారు.

 

మా ప్రభుత్వంలో ఎక్కడా బ్లాక్ మార్కెట్ వ్యవస్థ లేదని, నేరుగా ఆర్బికేల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలను సరఫరా చేశామన్నారు. సీఎం చంద్రబాబు దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని, యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. కమిషన్లు రావని ఆర్బికే వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

 

అన్నదాత సుఖీభవ 40,000 ఇవ్వాల్సివుంటే కేవలం ఐదు వేలతో సరిపెట్టిందని, ఉచిత పంటల బీమా లేదేలేదన్నారు. రైతులకు ఉల్లికి కనీస ధర 2500 ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఎనిమిది రూపాయలతో సరిపెడుతున్నారని రుసరుసలాడారు. అన్నట్లు మాజీ సీఎం జగన్ చెప్పిన ఈ ధరలో చాలావరకు అబద్దాలు చెప్పారని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ ఆరోపణలపై ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Posted Under AP
Editor