Latest Posts

ఉచిత బస్సు అమలు ముహూర్తం ఖరారు..! ఎప్పుడంటే..?

ఏపీలో మరో పథకం అమలుకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి కానుండంటంతో ఎన్నికల హామీల అమలు పైన వరుసగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకం అమలు పైన మంత్రివర్గ ఉప సంఘంతో పాటుగా ఆర్టీసీ అధి కారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇప్పటికే మార్గదర్శకాలు దాదాపు సిద్దం అయ్యాయి. తాజా గా జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరోలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసారు.

 

అమలు నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సిద్దమైంది. రెండు నెలల కాలం లోనే కర్ణాటక తరహాలో ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని తాజాగా జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే ఈ పథకం అమలు దిశగా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసారు. మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు ఈ పథకం అమలు చేస్తున్న కర్ణాటక, తెలంగాణలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇదే సమయంలో ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం మార్గదర్శకాలు సిద్దం చేస్తోంది.

 

కసరత్తు

అధికారులు ఇచ్చిన నివేదికలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా 2,000ల కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. చాలాకాలంగా ఉద్యోగ నియామకాలు లేక, పదవీ విరమణల కారణంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వేధిస్తోంది. కొత్తగా 3,500 మంది వరకు డ్రైవర్‌ పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. ఆర్టీసీ పై భారం మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు రూ.250 నుంచి రూ.260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతినెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుందని తేల్చారు. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతినెలా వచ్చే రాబడిలో 25 శాతం అంటే దాదాపు రూ.125 కోట్లను సర్కార్ తీసుకుంటోంది. ఇకపై ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకూడదని, అలాగే మిగిలిన రూ.125 నుంచి రూ.135 కోట్లను అదనంగా ప్రభుత్వమే, ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు

Posted Under AP
Editor