పాకీస్తానీలు తెలంగాణ వదిలి వెళ్లిపోండి.. వాళ్లు మాత్రం ఉండొచ్చు: డీజీపీ

పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ ఆంక్షలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. పాక్ జాతీయులు దేశం విడిచిపెట్టి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. వారిని గుర్తించి వెనక్కు పంపించే ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతని రాష్ట్రాలపై పెట్టింది. ఈమేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయుల వివరాలను అందించాలని కోరారు. వారందర్నీ తరలించే విషయంలో చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా కేంద్రం ఆదేశాల ప్రకారం పాక్ జాతీయుల్ని తిరిగి పంపించేందుకు చర్యలు తీసుకుంది.

 

డీజీపీ ఆదేశాలు..

తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చారు తెలంగాణ డీజీపీ జితేందర్.

ఈ నెల 27 తర్వాత పాకిస్తానీయుల వీసాలు పని చేయవని ఆయన స్పష్టం చేశారు. మెడికల్ వీసాల మీద ఉన్న వారికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. అయితే వారికి మరో 2 రోజులు అదనపు అవకాశం ఇచ్చారు. అండే మెడికల్ వీసామీద వైద్యం కోసం తెలంగాణకు వచ్చినవారు ఏప్రిల్ 29 వరకు ఇక్కడ ఉండొచ్చు. ఆ తర్వాత వారు దేశం విడిచి వెళ్లాల్సిందే. మూడోరకం వీసా.. అంటే లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి మాత్రం ఈ నిబంధన వర్తించదని తెలంగాణ డీజీపీ తెలిపారు. ఈమేరకు ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. భారత్ లో ఉన్న పాకిస్తానీలు అటారి బార్డర్ ద్వారా తిరిగి అక్కడికి వెళ్లొచ్చు. ఈనెల 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలని, ఒకవేళ ప్రభుత్వం కళ్లుగప్పి అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.

 

లెక్కలు తీస్తున్నారు..

హైదరాబాద్ లో ఎంతమంది పాకిస్తానీలు వీసాపై వచ్చి ఉంటున్నారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అనధికారికంగా ఎవరైనా ఉంటున్నారా..? వీసా పరిమితి తీరిపోయినా కూడా ఇంకా ఎవరైనా ఇక్కడే ఉన్నారా అనే కోణంలో వారు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. పాకిస్తానీయులు భారత్ లో ఉండకూడదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. గడువులోగా వారికై వారు స్వచ్ఛందంగా వెళ్తే సరి, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ ఆల్రడీ హెచ్చరించారు. మరి పోలీస్ హెచ్చరికల్ని పాకిస్తానీయులు ఎంత సీరియస్ గా తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ప్రత్యేక అనుమతి కోరుతూ ఎవరైనా పోలీసుల్ని ఆశ్రయిస్తారేమో వేచి చూడాలి.

 

నగరంలో నిఘా..

మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. నగరంలోని సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పాత బస్తీతో పాటు వివిధ ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ నగరం కూడా గతంలో టెర్రరిస్ట్ దాడులకు గురైంది. గతంలో దాడులు జరిగిన ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు.

Posted Under AP
Editor