ప్రస్తుతం మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదాల గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. మంచు మనోజ్ ఒకవైపు, మంచు విష్ణు, మోహన్ బాబు ఒకవైపు అవ్వడంతో ఈ ఫ్యామిలీ గొడవలు అందరి ముందుకు వచ్చాయి. ముఖ్యంగా మంచు మనోజ్ అయితే తనను, తన భార్యను, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారంటూ తండ్రి, అన్నపై విపరీతమైన ఆరోపణలు చేస్తున్నాడు. నెలరోజుల పాటు అందరూ సైలెంట్ అవ్వడంతో గొడవలు కాస్త సర్దుకున్నాయని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి తండ్రిని ఆరోపిస్తూ రచ్చ చేసిన మనోజ్.. తాజాగా ట్విటర్లో ఓ పోస్ట్ షేర్ చేసి అందరికీ సందేహాలు కలిగేలా చేశాడు.
వ్యంగ్యమైన పోస్ట్
మంచు విష్ణు తాము లేని సమయంలో ఇంటికి వచ్చి కార్లను, వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు దొంగలించాడని మంచు మనోజ్ కొత్తగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా దీని గురించి మీడియా ముందుకు వచ్చి వివరించాడు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి ఉత్తర ప్రదేశ్కు వెళ్లి, అక్కడ ముఖ్యమంత్రిని కలిసి, ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసి వచ్చారు. హైదరాబాద్లో తమ్ముడు తనపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నా కూడా మంచు విష్ణు ఏ మాత్రం పట్టించుకోకుండా తన పూర్తి ఫోకస్ అంతా ‘కన్నప్ప’పైనే పెట్టాడు. దీంతో మనోజ్ ఆగ్రహంతో ‘కన్నప్ప’పై ఒక వ్యంగ్యమైన పోస్ట్ షేర్ చేశాడు.
మంచి ప్లానింగ్
‘కన్నప్ప’ (Kannappa) సినిమా జూన్ 27న విడుదల కానుందని మంచు విష్ణు ప్రకటించాడు. దీనిపై మంచు మనోజ్ ఒక పోస్ట్ షేర్ చేశాడు. ‘మీ క్యాలెండర్స్ను మార్క్ చేసుకోండి. ది లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది’ అని చెప్తూ జులై 17 గురించి ప్రస్తావించాడు. ‘ఇంతకీ రిలీజ్ జులై 17ఆ? లేదా జూన్ 27ఆ? వంద కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సినిమాకు పీఆర్ ప్లానింగ్ కేక ఉంది’ అని కౌంటర్ వేశాడు మంచు మనోజ్. అంతే కాకుండా ‘కన్నప్ప’ సినిమా రూ.100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కితే అందులో రూ.50 కోట్లు కమీషన్ మంచు విష్ణుదే అని ఆరోపణలు చేశాడు. అయితే జులై 17 గురించి తను ఎందుకు ప్రస్తావించాడు అని మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు.
బయటపెట్టడానికి సిద్ధం
మంచు విష్ణు (Manchu Vishnu) ఎన్నో స్కామ్స్ చేశాడని, అవన్నీ ఏదో ఒకరోజు బయటపెడతానని ఇప్పటికే మంచు మనోజ్ (Manchu Manoj) ఓపెన్గానే వార్నింగ్ ఇచ్చాడు. అంతే కాకుండా తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో తనంటే తన అన్నకు కుల్లు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతే కాకుండా మంచు విష్ణు పర్సనల్ లైఫ్లో ఎవ్వరికీ తెలియని ఒక నిజాన్ని కూడా బయటపెడతానని చెప్పి సైలెంట్ అయిపోయాడు. తను సైలెంట్ అవ్వడంతో గొడవలు సర్దుకున్నాయని, కుటుంబంతా ఒక రాజీకి వచ్చిందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా మంచు మనోజ్ షేర్ చేసిన పోస్ట్ చూస్తుంటే విష్ణు గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు బయటపెట్టే వరకు ఊరుకునేలా లేడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.