ఏపీలో విద్యార్ధుల ఫీజు రీయింబర్స్ మెంట్ పై గుడ్ న్యూస్..!

ఏపీ విద్యార్దులకు ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో విద్యాసంస్ధల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్ధులకు ఊరటనిస్తూ ఓ కీలక పథకానికి సంబంధించి రూ.600 కోట్ల బకాయిల్ని ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో మరో విడతగా రూ.400 కోట్లు విడుదల చేస్తామని కూడా ప్రకటించింది. ఆ లోపు విద్యార్ధుల్ని ఇబ్బందిపెడితే ఊరుకోబోమని విద్యాసంస్థల్ని హెచ్చరించింది.

 

ఏపీలో 2024-25 ఆర్ధిక సంవత్సరంలో విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల బకాయిలు భారీగా పేరుకుపోయాయి.దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్లో రూ.600 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విద్యార్ధులు తమ ఫీజుల్ని స్కూల్స్, కాలేజీలకు చెల్లించేందుకు వీలు కలిగింది. ఇప్పటికే ఆయా విద్య సంస్థలు ఫీజు చెల్లించలేదన్న కారణంతో విద్యార్ధులకు పలు చోట్ల హాల్ టికెట్లు నిరాకరిస్తున్నాయి.

 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ.600 కోట్ల నిధుల్ని ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద విడుదల చేసింది. త్వరలో మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని కూడా ప్రకటించింది. దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని..విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దని..హాల్‌ టికెట్లు నిలిపివేస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో విద్యార్ధులకు ఊరట దక్కినట్లయింది.

 

తాజాగా శాసనమండలిలో వైసీపీ సభ్యులు విద్యార్ధుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా వైసీపీ హయాంలో రూ.4200 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టారని విద్యామంత్రి లోకేష్ తెలిపారు. వీటిన్నింటినీ చెల్లించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు సభా సాక్షిగా హామీ ఇస్తున్నట్లు లోకేష్ తెలిపారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఈ నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Posted Under AP
Editor