విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల అమ్మకాల్లో జరిగిన అవకతవకల గురించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ ఇంద్రకీలాద్రిలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించడంతో తాజాగా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
అసలేం జరిగిందంటే..
విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి భక్తులు సమర్పించిన చీరలను వేలంపాట ద్వారా ఆలయ అధికారులు అమ్మకాలు సాగిస్తారు. అయితే 2018 – 19 మధ్య జరిగిన అమ్మకాలలో కోట్ల రూపాయలలో అవినీతి జరిగిందంటూ అధికారులు గుర్తించారు. మొత్తం రూ. 1.68 కోట్ల మేర నగదు స్కాం జరిగిందని గుర్తించగా, చీరల అమ్మకాల బాధ్యతలు నిర్వహించిన ఈవో భ్రమరాంబకు, జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం కు దేవాదాయ శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై హైకోర్టును సుబ్రహ్మణ్యం ఆశ్రయించారు.
హైకోర్టులో తాజాగా వాదనలు జరగగా, న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు. జిల్లా ఎండోమెంట్ అధికారితో చీరల అమ్మకాల్లో జరిగిన అవినీతిపై విచారణ సాగించాలన్నారు. పూర్తి విచారణ జరిగే వరకు ఎటువంటి పెనాల్టీలు, చర్యలు తీసుకోవద్దని దేవదాయ శాఖ అధికారులను హైకోర్టు సూచించింది. కాగా సాధ్యమైనంత త్వరగా జిల్లా ఎండోమెంట్ అధికారితో విచారణ నిర్వహించేందుకు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.
