కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పన్నుల వాటాల్లో దక్షిణాది రాష్ట్రాలకు హక్కుగా రావలసిన నిధుల విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశం ప్రగతిబాటలో పయనించడానికి అన్ని రాష్ట్రాలు సమంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
ABP Network మీడియా సంస్థ హైదరాబాద్లో నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్’ సదస్సు (The Southern Rising Summit 2024)లో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రగతిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, రైజింగ్ తెలంగాణ (Rising Telangana), రైజింగ్ హైదరాబాద్ (Rising Hyderabad) లక్ష్యాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
Center is discriminating against southern states in tax shares CM Revanth Reddy
రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ ఆలోచనలను వివరించారు. సబర్మతి రివర్ ఫ్రంట్కు మద్దతునిస్తున్న వారు మూసీ పురుజ్జీవాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆక్షేపించారు. మూసీ, ఈసా నదుల కలయిక ప్రాంతమైన బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమంగా గాంధీ స్మారకాన్ని నిర్మించతలపెట్టామన్నారు సీఎం రేవంత్.
తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి కాంగ్రెస్ ప్రధానులు దేశంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల ఫలితాలను వివరించారు. ప్రధానంగా బహుళార్థ సాధక ప్రాజెక్టులు, విద్య, హరిత విప్లవం, బ్యాంకుల జాతీయీకరణ, 73-74 వ రాజ్యాంగ సవరణలు, శాస్త్ర సాంకేతిక రంగంలో తీసుకొచ్చిన విప్లవం, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పన, తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి ఏ విధంగా తోడ్పడిందీ వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఎంతో మంది యువకుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రగతి విషయంలో కొందరు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం అన్నారు. యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను… రైజింగ్ తెలంగాణగా, రైజింగ్ హైదరాబాద్గా తీర్చిద్దడంలో అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
