Latest Posts

మంత్రి కొండా సురేఖపై కోర్టులో కేటీఆర్ షాకింగ్ స్టేట్మెంట్..!

మంత్రి కొండ సురేఖ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేటీఆర్ ను టార్గెట్ చేసిన క్రమంలో కొండా సురేఖ సినిమా సెలబ్రిటీలకు కేటీఆర్ కు లింకు ఉందని అర్థం వచ్చేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగచైతన్య సమంతల విడాకులకు కేటీఆర్ కారణం అంటూ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

న్యాయమూర్తి ముందు కేటీఆర్ వాంగ్మూలం

తన వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన కేటీఆర్ 100 కోట్ల పరువునష్టం దావా వేసి కొండా సురేఖతో న్యాయ పోరాటానికి దిగారు. ఈ క్రమంలో తాజాగా కొండా సురేఖ పై వేసిన పరువు నష్టం దావా పిటిషన్ విచారణలో భాగంగా నేడు నాంపల్లి కోర్టుకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ కోర్టులో తన వాదనలు బలంగా వినిపించారు. న్యాయమూర్తి ముందు కేటీఆర్ వాంగ్మూలాన్ని ఇచ్చారు.

 

తెలంగాణా ఉద్యమంతో పాటు రాజకీయాల్లో

కేటీఆర్ తన వాంగ్మూలంలో తాను అమెరికాలో ఆరేళ్లు విద్యాభ్యాసం చేశానని, చదువు పూర్తయిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చానని అప్పుడే తెలంగాణ ఉద్యమం జరుగుతుందని, తెలంగాణ ఉద్యమంలో భాగంగా తిరిగి అమెరికా వెళ్లలేదని తెలిపారు. 2006 ఆగస్టులో కెసిఆర్ కరీంనగర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారని, దీనితో మళ్లీ ఉప ఎన్నికలు వచ్చాయని ఇక 2006 నుంచి 2009వరకు తాను తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేశానని పేర్కొన్నారు.

 

మంత్రిగా పని చేశా

తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశానని, 2009లో సిరిసిల్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచానని, ఐదుసార్లు తాను అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచానని కేటీఆర్ పేర్కొన్నారు. తాను మంత్రిగా పనిచేశానని, 2014 నుండి 2023 వరకు మంత్రిగా ఉన్నానని పేర్కొన్న కేటీఆర్ 2018 లో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యానని తెలిపారు.

 

కొండ సురేఖ తన మాటలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు

ప్రజా జీవితంలో ఉన్నానని పేర్కొన్న ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులు అందుకున్నానని, ఐటీ మినిస్టర్ గా అనేక కంపెనీలను తెలంగాణ రాష్ట్రానికి తెచ్చానని పేర్కొన్నారు. తన పరువు, ప్రతిష్టల గురించి దెబ్బతీసేలా కొండా సురేఖ మాట్లాడారని కోర్టులో కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. 18 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్న తనను కొండ సురేఖ తన మాటలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు.

 

పబ్లిసిటీ కోసమే కొండా సురేఖ ఆరోపణలు

నిరాధారమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించానన్న కేటీఆర్ యూట్యూబ్ లింక్స్ ను, పేపర్ కథనాలను అన్నింటినీ కోర్టుకు ఇచ్చాను అని తెలిపి చట్టప్రకారం కొండా సురేఖ పై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. పబ్లిసిటీ కోసమే కొండా సురేఖ తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.

 

కోర్టులో కేటీఆర్ తో పాటు ఆయన స్టేట్మెంట్ రికార్డ్

దాదాపు 20 నిమిషాల పాటు ఆయన స్టేట్మెంట్ ను న్యాయస్థానం రికార్డు చేసింది. కేటీఆర్ తో పాటు సాక్షులు దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్, బాల్క సుమన్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్ తో పాటు దాసోజు శ్రవణ్ వాంగ్మూలాలను నమోదు చేసిన నాంపల్లి కోర్టు మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను ఈనెల 30వ తేదీన నమోదు చేయనుంది.

Editor