ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, చివరిరోజు సర్వీస్‌లోకి ఐపీఎస్ అధికారి..!

ఎట్టకేలకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం ఫలించింది. ఆయనను సర్వీస్‌లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సర్వీసులోకి తీసుకునేందుకు వీలుగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేసింది. వెంటనే పోస్టింగ్ ఉత్తర్వులు వెలువడ్డాయి. శుక్రవారం ఆయన ఉద్యోగ విరమణ దృష్ట్యా, ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు సీఎస్ జవహర్‌రెడ్డి. వెంటనే ఏపీ ప్రింటింగ్, స్టేష‌న‌రీ డీజీగా ఏబీ వెంక‌టేశ్వ‌రరావు బాధ్యతలు చేపట్టారు. మొత్తానికి ఐదేళ్లపాటు ఏబీవీ చేసిన పోరాటానికి చివరి రోజు ఫలితం దక్కినట్లైంది.

 

ఈనెల 8న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఎత్తివేసింది. అయితే క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను హైకోర్టులో తోసిపుచ్చింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోతే ఏబీవీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపింది న్యాయస్థానం. గురువారం న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఆయన, సీఎస్ జవహర్‌రెడ్డికి అందజేశారు.

 

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ వేటు వేసింది. దాదాపు నాలుగున్నరేల్లుగా సస్పెన్షన్‌లో ఉంచింది. డీజీ క్యాడర్ అధికారి కూడా. ఏబీవీపై అభియోగాలు మోపడమే తప్ప, వాటిని ప్రభుత్వం నిరూపించలేకపోయింది. చివరకు క్యాట్ సైతం ఇదే తీర్పును ఇచ్చింది.

 

క్యాట్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. ఈక్రమంలో ఏబీవీకి మద్దతుగా ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున పౌరులు ఉద్యమం చేపట్టారు. ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ గురువారం సాయంత్రం వరకు దాదాపు 44 వేల మంది ఛేంజ్.ఓఆర్జీలో సంతకాలు చేసి రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ప్రధానమంత్రికి పంపించారు. ఏబీవీకి ఐపీఎస్ అధికారుల సంఘం నుంచి మద్దతు కరువైంది. చివరకు ఏపీ హైకోర్టు ఆదేశాలతో చివరి రోజు డ్యూటీలో చేరారు. ఇవాళ్టితో ఆయన పదవీకాలం ముగియనుంది.

Posted Under AP
Editor