నిజామాబాద్, ఆదిలాబాద్‌లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీలు ..

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన జనజాతర సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ, కేసీఆర్‌ విషం కక్కుతున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5 అమలు చేశామని తెలిపారు.జిల్లాకో విశ్వవిద్యాలయం ప్రారంభిస్తామని అన్నారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ పూర్తిగా చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. సెప్టెంబర్ 17లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.

 

అదేవిధంగా జీవన్‌ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ, కేసీఆర్‌పై రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి బీజేపీ ఎంపీ మోసం చేశారని ఆరోపించారు. ఈ బోర్డు ఏర్పాటుపై మోడీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్‌ అని లేదని చెప్పుకొచ్చారు. ఎన్నికలు అయ్యాక బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదన్నారు రేవంత్.

 

 

కాంగ్రెస్‌ హయాంలోనే కుప్టి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ద్వారా ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేస్తామన్నారు. తుమ్మిడిహట్టిలో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు కడతామని, ఆదిలాబాద్‌లో కొత్తగా విశ్వవిద్యాలయం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. నాగోబా జాతరకు రూ.4 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

 

కాంగ్రెస్‌ హయాంలో ఆదిలాబాద్‌లో సిమెంట్‌ పరిశ్రమను నిర్మించామని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. త్వరలో ఆ పరిశ్రమను తెరిపిస్తామని పేర్కొన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని గుర్తు చేశారు. కేసీఆర్‌ హయాంలో ఎవరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు రాలేదని సీఎం రేవంత్అన్నారు. కేసీఆర్‌ మాత్రం వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌజ్‌ కట్టుకున్నారని మండిపడ్డారు.

 

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ, కేసీఆర్‌ విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు పరిపాలించమని ప్రజలు తమకు అధికారం ఇచ్చారన్నారు. బీసీ జనగణన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని రేవంత్ తెలిపారు.

Editor