ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకు అనుమతి లభించింది. తీహార్ జైలులో కవితను ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ సంప్రదించింది. ఈ మేరకు కోర్టు ఆమెను ప్రశ్నించేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.
ప్రశ్నించటానికి ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కవితను ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది. ప్రశ్నించే సమయంలో ల్యాప్టాప్, ఇతర స్టేషనరీకి తీసుకువచ్చేందుకు సీబీఐకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి మంజూరు చేసింది. అలాగే విచారణలో ఉన్న నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి గత డిసెంబర్ నెలలో హైదరాబాద్లోని కవిత నివాసంలోనే సీబీఐ అధికారులు ఆమెను మూడు రోజులపాటు విచారించిన విషయం తెలిసిందే. అయితే, అవసరమైన మరింత సమాచారం కోసం ఆమెను మరోసారి విచారించాలని సీబీఐ భావించింది. ఈ క్రమంలోనే కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో తాము నమోదు చేసిన వాంగ్మూలం, అప్రూవర్గా మారినవాళ్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. కవితను ప్రశ్నించిన కొంత సమాచారం రాబట్టిన తర్వాత సీబీఐ ఈ కేసులో మరో ఛార్జీషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారాయని, లిక్కర్ పాలసీ విధానం రూపొందించి ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధిచేకూరేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ మొదట కేసు నమోదు చేసింది. అయితే, ఈ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. పదిరోజులపాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ ముగియడంతో ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే కవితను మరోసారి ప్రశ్నించేందుకు సీబీఐ కోర్టు నుంచి అనుమతి తీసుకుంది.
