ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా అక్కడి నుంచి గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
టీడీపీ మద్దతుతో ఈసారి పిఠాపురం నుంచి కచ్చితంగా గెలిచి తీరుతానని ధీమాగా ఉన్న పవన్.. తాను గెలిచాక తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతానన్న ప్రత్యర్ధుల ప్రచారంపై ఫోకస్ పెట్టారు. దీంతో స్ధానికంగా ఉండేందుకు ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నారు.
పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా స్ధానికంగా ఉంటూ మధ్యలో హైదరాబాద్ వెళ్లి వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న పవన్.. నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న నాలుగు అంతస్ధుల ఇల్లు తీసుకున్నారు. ఓదూరి నాగేశ్వరరావు అనే వ్యక్తి నిర్మిస్తున్న ఈ ఇంటిని పవన్ కొనుగోలు చేశారా లేక లీజుకు తీసుకున్నారో మాత్రం తెలియలేదు.
కానీ చేబ్రోలు గ్రామంలో మాత్రం పవన్ ఇల్లు తీసుకున్నట్లు నిర్దారణ అయింది. త్వరలో ఈ ఇంట్లో పవన్ గృహప్రవేశం చేయబోతున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి పవన్ పిఠాపురంలో ఎంట్రీ ఇవ్వగానే తొలిరోజే తాను స్ధానికంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పేశారు. అందుకోసం ఏదో ఒక గ్రామంలో ఇల్లు కొనుక్కునేందుుకు వెతుకుతున్నట్లు కూడా తెలిపారు. అన్నట్లుగానే ఇప్పుడు చేబ్రోలులో పవన్ ఇల్లు తీసుకున్నారు. ఉగాదికి పవన్ ఈ ఇంట్లోకి మారే అవకాశం ఉంది.
