Latest Posts

వైఎస్ షర్మిలనా.. మజాకా.. ఎన్నికల్లో పోటీకి వారికి ఇంటర్వ్యూలు; సెలక్షన్స్!! .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ వైసిపి, టిడిపి, జనసేనలు ప్రజాక్షేత్రంలోకి వెళుతుంటే, ఎన్నికల పోరాటానికి తాము సైతం అంటూ సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల బాధ్యత తీసుకున్న తర్వాత కొత్త ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి జరగనున్న ఎన్నికలపై బోలెడు ఆశలు పెట్టుకుంది.

 

గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలని పక్కా వ్యూహంతో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను వైయస్ షర్మిల కు అప్పగించింది. ఏపీ ఎన్నికలకు వైసిపి, టిడిపి జనసేన కూటమి సర్వేల ఆధారంగా ప్రజాక్షేత్రంలో అభ్యర్థులకు ఉన్న మద్దతు ఆధారంగా, వారి ఆర్థిక స్థితిగతుల ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం టికెట్ల కేటాయింపులో కొత్త విధానాన్ని అవలంబిస్తోంది.

 

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల టికెట్ ఆశిస్తున్న ఆశావహులను ఇంటర్వ్యూలు చేస్తూ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పక్కా కార్పొరేట్ స్టైల్లో వైయస్ షర్మిల ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండడం అటు పార్టీ శ్రేణులలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని కలిగిస్తుంది. ఇప్పటికే వివిధ నియోజకవర్గాలలో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థులు ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

 

ఆంధ్ర రత్న భవన్ వేదికగా నిన్న మొదలైన ఇంటర్వ్యూలు, నేడు కూడా కొనసాగుతున్నాయి. నిన్న నరసాపురం, మచిలీపట్నం, నరసరావుపేట, ఏలూరు, బాపట్ల, గుంటూరు లోక్సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలకు టికెట్లను ఆశిస్తున్న ఆశావహులకు వైయస్ షర్మిల ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిన్న రాత్రి వరకు వీరిని ఇంటర్వ్యూ చేశారు వైఎస్ షర్మిల.

 

నేడు శ్రీకాకుళం, అరకు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 67 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆశావహులతో వైయస్ షర్మిల నేరుగా మాట్లాడుతున్నారు. అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులు, వారికి ప్రజలలో ఉన్న మంచి పేరు, అభ్యర్థుల గుణగణాలు, పార్టీ పట్ల వారికున్న కమిట్మెంట్ ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వైఎస్ షర్మిల అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Posted Under AP
Editor