Latest Posts

ఎన్నికల బరిలో సీఎం రేవంత్ సోదరుడు..

తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి పార్టీలు సిద్దం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల గెలిచిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. సీఎంగా..పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ సమర్థతకు వచ్చే ఎన్నికలు పరీక్షగా మారునున్నాయి. దీంతో, ఎంపీ అభ్యర్దుల విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ సమయంలోనే రేవంత్ సోదరుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతోంది.

 

సీట్ల కోసం పోటీ : అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావటంతో కాంగ్రెస్ నుంచి ఎంపీ ఎన్నికల్లో ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని పార్టీ నేతలు చెబుున్నారు. ఎంపీ స్థానాల్లో పార్టీ అభ్యర్దుల గెలుపు కోసం ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.

 

సీఎం రేవంత్ మహబూబ్ నగర్ తో పాటుగా చేవెళ్ల స్థానాల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 17 లోక్సభ నియోజకవర్గాలకు 309 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా తిరుపతి రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటే తామంతా కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

 

రేసులో సీఎం సోదరుడు : తిరుపతి రెడ్డిని ముఖ్యమంత్రి సోదరుడిగా కాకుండా, కాంగ్రెస్‌ పార్టీ క్రీయాశీల నాయకునిగా గుర్తించాలని పేర్కొన్నారు. దీంతో, తిరుపతి రెడ్డి పోటీ ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే, పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన వారికే సీట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన పీఈసీ సమావేశంలో పార్టీ స్పష్టం చేసింది.

 

తిరుపతి రెడ్డితో పాటుగా మరో సోదరుడు కొండల్ రెడ్డి పేరు రేుసులోకి వచ్చింది. మల్కాజ్ గిరి నుంచి ఆయన సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నియోజకవర్గం నుంచి నిర్మాత బండ్ల గణేష్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సీటు ఆశిస్తున్నారు. రేవంత్ సోదరులు ఇద్దరూ రెండు నియోజకవర్గాల నుంచి రేసులో ఉన్నారు. ఒకరికి సీటు ఖాయమని భావిస్తున్నారు.

 

సీట్లు దక్కేదెవరికి : అయితే, రేవంత్ సీఎంగా ఉన్న సమయంలో అదే కుటుంబం నుంచి మరొకరికి సీటు దక్కటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాధ్యం కాదనే వాదన ఒక వైపు వినిపిస్తోంది.ఈ సారి ఎంపీ స్థానాల్లో పార్టీ టికెట్ కోసం కాంగ్రెస్ నుంచి సీనియర్ల వారసులు రేసులోకి వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. మాజీ మంత్రి జానారెడ్డి కూడా తన కుటుంబ సభ్యులకు టికెట్ ఆశిస్తున్నారు.

 

దరఖాస్తు కూడా చేసుకొని ఫైనల్ లిస్ట్, నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్నారు. కుటుంబానికి ఒకటే టికెట్ అని కాంగ్రెస్‌ హైకమాండ్ పదే పదే చెబుతోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మందికి టికెట్ దక్కలేదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ , బీజేపీని పూర్తిగా దెబ్బ కొట్టాలనేది కాంగ్రెస్ ప్లాన్. దీనికి కౌంటర్ వ్యూహాలతో ఆ రెండు పార్టీలు సిద్దమవుతున్నాయి. దీంతో, కాంగ్రెస్ లో చివరికి ఎవరికి సీట్లు దక్కుతాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Editor