104, 108 అత్యవసర సర్వీసుల ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జనవరి 23 నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇంతలో తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. 22లోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే.. ఆ తరువాత రోజు నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ సీఈఓ కు తమ సమ్మె నోటీసును అందించారు. సమస్యలను ఎప్పటి నుంచో పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే సమ్మెకు దిగాల్సి వస్తోందని 104, 108 ఉద్యోగులు చెబుతున్నారు.
కరోనా కష్టకాలంలో సైతం తాము విధులు నిర్వహించిన విషయాన్ని 104, 108 ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. చాలామంది కోవిడ్ బారినపడి మృత్యువాత పడ్డారని.. అయినా ప్రభుత్వ ఆదేశాలను పాటించామని చెప్పుకొస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 108, 104 వాహనాలను సమకూర్చింది. నిర్వహణకు సంబంధించి ఏజెన్సీలను మార్చింది. కానీ ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. చాలాసార్లు ఉద్యోగ సంఘాల నాయకులు వినతి పత్రాలు అందించినా.. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారికి సమ్మె అనివార్యంగా మారింది.
