ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు తెర మీదకు

ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. పార్టీలు కొత్త పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి.

షర్మిల రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఏపీలో షర్మిల పాత్ర పైన స్పష్టత రావాల్సి ఉంది. కానీ, ముఖ్యమంత్రి ఈ రోజు కాకినాడ సభలో చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి. కుటుంబాలను చీల్చుతూ.. కొత్త పొత్తులు పెట్టుకుంటారనే సీఎం వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరం.

ఏపీలో కొత్త పొత్తులు : ఏపీలో ఇప్పటికే టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఖయమైంది. బీజేపీ తమతో కలిసి రావాలని ఆ రెండు పార్టీల అధినేతలు కోరుకుంటున్నారు. ఈ వారంలోనే బీజేపీ నేతల నుంచి పొత్తుల పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తాము కలిసామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీజేపీ కాదంటే చంద్రబాబు ఆలోచన ఏంటనేది ఆసక్తి కరంగా మారనుంది. ఈ ఎన్నికలు టీడీపీకి నవ్ ఆర్ నెవర్ గా మారటంతో అవసరమైతే కాంగ్రెస్ తోనూ జత కట్టేందుకు చంద్రబాబు సిద్దంగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే, పవన్ మాత్రం బీజేపీ వైపే చూస్తున్నారని సమాచారం. కానీ, ఓట్లు చీలితే మొత్తానికే నష్టం వస్తుందనే ఆందోళన ఇద్దరిలోనూ ఉంది.

సీఎం జగన్ వ్యాఖ్యల వెనుక : ఈ సమయంలోనే షర్మిలకు కాంగ్రెస్ పగ్గాల పైన ఒక వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.షర్మిల సైతం తాను కాంగ్రెస్ కోసం పని చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు కాకినాడ కేంద్రంగా సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజకీయాల కోసం కుటుంబాలనూ చీలుస్తారని.. కొత్త పొత్తులు పెట్టుకుంటారని కీలక పేర్కొన్నారు. దీని ద్వారా పరోక్షంగా షర్మిల అంశాన్నే జగన్ ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో పొత్తుల అంశంలోనూ జగన్ చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు, షర్మిల పార్టీలు టీడీపీ -కాంగ్రెస్ పొత్తుతో ఏపీలో ఎన్నికల బరిలోకి దిగనున్నాయా అనే చర్చ మొదలైంది. ఇందుకు పవన్ సిద్దంగా ఉన్నారా..బీజేపీ ముందుకు వస్తే ఏం అప్పుడు చంద్రబాబు ఏం చేస్తారు అనేది మరో ఇంట్రస్టింగ్ డిబేట్ మొదలైంది.

 

టీడీపీ-కాంగ్రెస్ కలుస్తాయా: ఏపీలో మరిన్ని పొత్తులు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ చాలా క్లియర్ గా చెప్పారు. క్రిస్మస్ సమయంలో నారా ఫ్యామిలీకి షర్మిల గిఫ్ట్స్ పంపటం కూడా ఏపీలో కొత్త రాజకీయానికి సంకేతంగా చర్చ జరిగింది. అదే విధంగా కొంత కాలంగా వైఎస్ వివేకా కుమార్తు సునీతకు మద్దతుగా చంద్రబాబు ప్రతీ సందర్భంలోనూ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కడప నుంచి సునీతను బరిలోకి దింపాలనే ఆలోచన ఉందనే చర్చ వినిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ వైఖరి పైన క్లారిటీ వచ్చిన తరువాత చంద్రబాబు పొత్తుల అంశంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో, పొత్తుల కోసం కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్ మరోసారి కలుస్తాయా అనే కీలక అంశం తెర మీదకు వచ్చింది

Posted Under AP
YES9 TV