కాసేపట్లో జగన్ వద్దకు షర్మిల, ఆర్కే-కాంగ్రెస్ లో చేరే తొలి ఎమ్మెల్యే నేనే-అమరావతికి వ్యతిరేకం కాదు..

వైఎస్ షర్మిల, విజయమ్మతో కలిసి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసేందుకే తాను సీఎం జగన్ వద్దకు వెళ్తున్నట్లు ఆళ్ల తెలిపారు.

షర్మిలతో కలిసి ప్రయాణం చేయబోతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించిన ఆర్కే.. ఇవాళ ఆమెతో కలిసి సీఎం వద్దకు వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇవాళ మాత్రం కేవలం పెళ్లి పత్రిక ఇచ్చేందుకే వెళ్తున్నట్లు తెలిపారు.

షర్మిల బాటలోనే తాను నడుస్తానని, తామంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లమేనని ఆర్కే తెలిపారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో తాను కూడా ఆమె సమక్షంలో పార్టీలో చేరతానని ఆర్కే వెల్లడించారు. కాంగ్రెస్ స్వాతంత్రం రాక ముందు నుంచీ ఉన్న పార్టీయేనన్నారు. పీసీసీ అధ్యక్షుడు, షర్మిల సమక్షంలో తాను పార్టీలో చేరాక తన పోటీపై నిర్ణయం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పెద్దలు తీసుకునే నిర్ణయాలకు తాను కట్టుబడి ఉంటానన్నారు. కాంగ్రెస్-టీడీపీ కలుస్తాయని తాను భావించడం లేదన్నారు.

మంగళగిరిలో రేపు కచ్చితంగా విపక్ష పాత్ర పోషిస్తానని ఆర్కే వెల్లడించారు. గత నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఉంటూ ఎక్కడ విఫలమయ్యానో ప్రజలకు వివరిస్తానన్నారు. అమరావతిలో స్వచ్చంధమని చెప్పి బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చేయడాన్ని తాను వ్యతిరేకించానన్నారు. కానీ అమరావతికి మాత్రం తాను వ్యతిరేకం కాదన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ సందర్భంగా చేసిన తప్పిదాలపై న్యాయస్ధానంలో పోరాటం చేశానని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంతంలో రైతులకు ఊరటనిచ్చేలా పలు మార్పులు చేశామన్నారు.

Posted Under AP
YES9 TV