జగన్ కు కౌంటర్ గా ఎన్నికల వేళ టీడీపీ కీలక నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల రాజకీయ కీలక మలుపులు తిరుగుతోంది. సీఎం జగన్ అటు సొంత పార్టీ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. కొత్త సమీకరణాలతో అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఇటు జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి చెబుతున్న సామాజిక న్యాయానికి ధీటుగా టీడీపీ కొత్త అస్త్రం సంధిస్తోంది. బీసీ వర్గాలను ఆకట్టుకొనేలా ఎన్నికల వేళ కొత్త కార్యాచరణ సిద్దం చేసింది.

 

టీడీపీ కీలక నిర్ణయం:తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రంలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4వ తేదీ నుంచి జయహో బిసి పేరిట ఒక కార్యక్రమాన్నిప్రారంభించా లని నిర్ణయించినట్లు పార్టీ నేత నారా లోకేష్ వెల్లడించారు. జయహో బిసి కార్యక్రమ నిర్వహణపై తొలుత చంద్రబాబు నేతృత్వంలో ఒక వర్క్ షాపు ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. జనవరి 4వ తేదీనుంచి పార్లమెంటు, అసెంబ్లీ మండలస్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో ఒక భారీ సభ ఏర్పాటుచేసి బిసి మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

 

 

జయహో బీసీ నినాదంతో:యువగళం పాదయాత్రలో బిసి సోదరులు పడుతున్న ఇబ్బందులు తాను తెలుసుకున్నట్లు చెప్పారు. బిసి సోదరులకు పుట్టినిల్లు టిడిపి అని లోకేష్ వివరించారు. నాడు ఎన్టీఆర్ 1982లో బిసి సోదరులకు సీట్లు ఇచ్చి గెలిపించి కీలకశాఖలు ఇచ్చి గౌరవించారని గుర్తు చేసారు. బిసి అంటే బలహీనవర్గం కాదు, బలమైన వర్గంగా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ 24శాతం రిజర్వేషన్ కల్పిస్తే, చంద్రబాబు 34శాతానికి పెంచారని వివరించారు. గత ప్రభుత్వంలో బిసిలకోసం రూ.36వేల కోట్ల బిసిలకు ఖర్చుచేశామన్నారు. చేనేత, మత్స్యకార, కల్లుగీత కార్మికులకు 50ఏళ్లకే పెన్షన్ ఇచ్చాం. శాసనసభలో తీర్మానం చేసి బిసి లకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు.

 

ప్రత్యేక మేనిఫెస్టో:2019లో వైసిపి అధికారంలోకి వచ్చాక అనేకమంది బిసిలను వేధిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్ ను 10శాతం తగ్గించారన్నారు. 56 కార్పొరేషన్లకు నిధులు, విధులు లేవు. బిసి కార్పొరేషన్ల డైరక్టర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ బిసిలు బ్యాక్ బోన్ అంటూనే వారి వెన్నువిరిచే కార్యక్రమాలు అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. శాసనసభ, శాసనమండలి, లోక్ సభ, రాజ్యసభలో అవకాశం ఇచ్చింది టిడిపీనేని గుర్తు చేసారు. బిసి సోదరులకు రక్షణకు ప్రత్యేక చట్టం, బిసిలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చానని వివరించారు. 2నెలలపాటు నిర్వహించే జయహో బిసి కార్యక్రమం ద్వారా వారి సమస్యలు తెలుసుకొని, పూర్తిస్థాయిలో వారికి భరోసా ఇస్తామని లోకేష్ వెల్లడించారు.

Posted Under AP
Editor