Latest Posts

మిగ్ జామ్ పై ప్రధానికి చంద్రబాబు లేఖ.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మిగ్ జామ్ తుపాను ప్రభావం వల్ల నష్ట పోయిన ప్రజల గురించి ప్రధాని మోదీకి లేఖ రాశారు. తుపాను వల్ల తీవ్రంగా నష్ట పోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని లేఖలో కోరారు. తుపాను కారణంగా కురిసిన భారీవర్షాలకు 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. ఆస్థి, ప్రాణనష్టం జరిగిందని చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి రాసిన లేఖలో వివరించారు. చంద్రబాబు మిచౌంగ్ తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని మోదీని కోరారు.

 

“రాష్ట్రంలోని 15 జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రజల జీవనాన్ని దెబ్బతీశాయి. తుపాను కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తద్వారా రూ. 10 వేల కోట్ల వరకు పంట నష్టం అయ్యింది. పంటలు దెబ్బతినడంతో పాటు పలు చోట్ల పశువులు చనిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి.

 

దాదాపు 770 కి.మీల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు నష్టం జరిగింది. వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయింది. తుపాను వల్ల పంట నష్టపోయి ఆవేదనతో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మత్స్యకారుల పడవలు, వలలకు కూడా నష్టం జరిగింది. వారు జీవనోపాధి కోల్పోయారు.

 

తుపాను ప్రభావం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న తమిళనాడుపై కూడా ప్రభావం చూపింది. తుపాను తీవ్రత, నష్టం దృష్ట్యా మిచౌంగ్ తుఫానును ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలి” చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖలో కోరారు. తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక బృందాన్ని పంపాలని మోదీని కోరారు. జాతీయ విపత్తుగా ప్రకటిస్తే బాధితులకు తక్షణమే మెరుగైన సహాయం అందుతుందని.. మీ ప్రకటన ద్వారా తుపాను బాధితులలో విశ్వాసాన్ని నింపే అవకాశం ఏర్పడుతుందన్నారు.

Posted Under AP
Editor