గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆందోల్లో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
తెలంగాణ ఆదాయమంతటినీ కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని రాహుల్ ఆరోపించారు. ల్యాండ్, సాండ్, మైన్స్, వైన్స్ అంతా కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉందన్నారు. ధరణి పోర్టల్ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములను గుంజుకున్నారని ఆరోపించారు. పరీక్ష పేపర్ల లీక్ చేయడంతో ఎంతో యువత నష్టపోయారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఆరోపించారు.
ఈ పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు ఏం చేసిందో కేసీఆర్ చెప్తారా? అని నిలదీశారు రాహుల్. దొరల సర్కారుకు, ప్రజల సర్కారుకు మధ్య తేడా ఏంటో తాము చెప్తున్నామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజల పాలనను చూపిస్తామని రాహుల్ చెప్పారు. తొలి కేబినెట్ సమావేశంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెడతామని రాహుల్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారుల కుటుంబానికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు రూ.5 లక్షలతో యువ వికాసం అమలు చేస్తామని తెలిపారు. ఈ నగదుతో చదువుకోవచ్చని.. కోచింగ్తీసుకునేందుకు కూడా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్లు నిర్మిస్తామని చెప్పారు. రైతులకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున రైతు భరోసా ఇస్తామన్నారు.
మహిళలకు రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఊరట కల్పిస్తామన్నారు. అలానే వారి ఖాతాలో ప్రతి నెలా రూ.2500 వేస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.15 వేలు చొప్పున రైతుభరోసా కల్పిస్తామన్నారు. కర్షకులకు మరిన్ని ఎన్నో కార్యక్రమాలు అందిస్తామని అన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ తనపై 24 కేసులు పెట్టారని.. తన ఎంపీ సభ్యత్వం రద్దు చేసి ఎంపీల క్వార్టర్స్ నుంచి పంపించేశారన్నారు రాహుల్. అవినీతిపరుడైన కేసీఆర్పై మాత్రం ఒక్క కేసు కూడా లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మంచి స్నేహం ఉందన్నారు. ఢిల్లీలో మోడీకి కేసీఆర్ సహకరిస్తారన్నారు. తెలంగాణలో కేసీఆర్కు మోడీ సాయం చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటోందని రాహుల్ విమర్శలు గుప్పించారు.
