రాజకీయాలలో ఎప్పుడూ చురుకుగా ఉండే రోజా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతూ తనదైన దూకుడును కొనసాగిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా చంద్రబాబు అరెస్టు తరువాత చేసిన వ్యాఖ్యలు, ఆమె తీరుపై టిడిపి నేతలు తీవ్రస్థాయిలో భగ్గుమన్నారు.
టిడిపి నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి, అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోజా బతుకేంటో తనకు తెలుసని అన్నారు . దీంతో మీడియా ముఖంగా కన్నీటి పర్యంతమైన రోజాకు సినీ వర్గాల నుండి, రాజకీయ వర్గాల నుండి మద్దతు లభించింది. ఇక ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే.
Minister Roja filed a defamation suit against three people along with Bandaru sathyanarayana!!
అయితే తాజాగా మంత్రి రోజా తనను కించపరుస్తూ మాట్లాడిన వారి వీడియోలు మేజిస్ట్రేట్ కు చూపించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పై పరువు నష్టం దావా వేశారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తో పాటు మరో ఇద్దరి పైన కూడా పిటిషన్ వేసిన రోజా నగరి టిడిపి ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ తోపాటు, టీవీ5 ఇంచార్జ్ రాజేంద్రప్రసాద్ పేర్లను పిటిషన్లో పొందుపరిచారు.
రోజా పిటిషన్ స్వీకరించిన కోర్టు రోజా స్టేట్మెంట్ ను నమోదు చేసింది. తనపై వ్యక్తిత్వ హననానిని పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని రోజా తన పిటీషన్ లో పేర్కొన్నారు. మంత్రి రోజాపై అసభ్య పదజాలంతో బండారు సత్యన్నారాయణ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
రోజా గతంలో అశ్లీల చిత్రాలలో నటించారని, ఆ వీడియోలు కూడా తన వద్ద ఉన్నాయని బండారు సత్యన్నారాయణ వ్యాఖ్యలు చేయటంతో దుమారం రేగింది. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకోగా, తాజాగా మంత్రి రోజా పరువు నష్టం దావా వెయ్యటం మరోమారు ఏపీ రాజకీయాలపై ఆసక్తిని రేకెత్తించింది.
