రేవంత్ రెడ్డి తీరు ఓటుకు నోటు.. సీటుకు రేటు అన్నట్టుంది: కేటీఆర్ ఘాటువ్యాఖ్యలు!!

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

తెలంగాణలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు తెలంగాణ మంత్రులు. ఇక తాజాగా తెలంగాణ ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు.

భూపాలపల్లి జిల్లాలో ఎన్నికల సభలో మాట్లాడిన మంత్రి కేటీఆర్ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని, రేటెంత రెడ్డి అని అడుగుతున్నారని ఆయన విమర్శించారు . రేవంత్ తీరు ఓటుకు నోటు.. సీటుకు రేటు అన్నట్టుగా ఉందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెడితే అమ్మేస్తారు అంటూవ్యాఖ్యలు చేశారు. నవంబర్ 30 వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్న మంత్రి అందరూ బీఆర్ఎస్ కే ఓటు వేయాలని సూచించారు. కేసీఆర్ ను మరోమారు ముఖ్యమంత్రిని చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

60 ఏళ్లలో చేయని అభివృద్ధి 10ఏళ్లలో బీఆర్‌ఎస్ చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒక్క ఛాన్స్ అని వచ్చినవాళ్లకు .. ఓటర్లు గతంలో అవకాశం ఇస్తే ఏం చేశారని నిలదీయమన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఓట్లకోసం ఎంతకైనా దిగజారుతారని, అవసరమైతే కాళ్లమీద పడతారని, వాళ్లను నమ్మితే మన కళ్లను మనమే పొడుచుకున్నట్లని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో, బీజేపీలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. రైతుబంధు ఇచ్చిన ఈ గట్టున ఉంటారా? రాబందుల్లా పీక్కు తిన్న ఆ గట్టునుంటారా? తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ ఓటర్లను ఉద్దేశించి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బిజెపి వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని బి ఆర్ ఎస్ కు ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

 

YES9 TV