గులాబీ నుండి తెలంగాణ విముక్తి కాబోతోంది.!ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులన్న రేవంత్ రెడ్డి.!

తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. తెలంగాణకు విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిందని, నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ విరగడ కాబోతోందన్నిరు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్బంగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాబోయే విజయదశమిని ఉత్సాహంగా జరుపుకోవాలని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయన్నారు. లక్ష కోట్లు, పదివేల ఎకరాల భూములను చంద్రశేఖర్ రావు కుటుంబం ఆక్రమించుకుందని, అమరవీరుల స్థూపం, సచివాలయ నిర్మాణంలో కూడా దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు..

అవినీతి సొమ్ముతో సీఎం చంద్రశేఖర్ రావు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించగానే సీఎంరు చలి జ్వరం వచ్చిందన్నారు రేవంత్. సీఎం చంద్రశేఖర్ రావు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని, ఇక ఆయన ఫాం హౌస్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని, డిసెంబర్ లో అద్భుతం జరగబోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని, పదేళ్ల చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు రేవంత్ రెడ్డి.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

సీఎం చంద్రశేఖర్ రావు కుటుంబీకులు శ్రీమంతులు అయ్యారు తప్ప… ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతీ మహిళకు నెలకు రూ.2500 రాబోతున్నాయని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించబోతున్నామన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల సాయం అందజేయబోతున్నామని, ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబోతున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నామన్నారు రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమ పథకాల అమలు..

ప్రతీ రైతుకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా రూ.15వేలు అందించబోతామన్నారు రేవంత్ రెడ్డి. సంపద పెంచాలి… పేదలకు పంచాలి అన్నదే కాంగ్రెస్ విధానమన్నారు. అధికారం కోల్పోతున్నామన్న భయం బిల్లా-రంగాలలో మొదలైందని, అందుకే స్థాయి లేకపోయినా సోనియా, రాహుల్ ను విమర్శిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలలో వేటిపైనైనా చర్చకు సిద్ధమని అధికార పార్టీకి సూటిగా సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

బీజేపీ, బీఆరెస్ కుట్రలను తిప్పికొట్టాలి..

2014 నుంచి 2023 వరకు బీఆరెస్ పాలనలో ఏం చేశారో చర్చకు రావాలని, అమరవీరుల స్థూపం వద్ద చర్చకు మేం సిద్ధమని, తేదీ చెప్పాలన్నారు రేవంత్. డిసెంబర్ 9, 2023న ఆరు గ్యారంటీలపైనే కాంగ్రెస్ తొలి సంతకం ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. వారు ఎవరిపక్షాన నిలబడ్డారో, ఎవరికి మద్దతుగా నిలుస్తారో తేల్చుకోవాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే బీజేపీ ప్రయత్నం చేస్తోంది, 2018లోనూ బీజేపీ చేసింది ఇదేనన్నారు. బీజేపీ, బీఆరెస్ ఫెవికాల్ బంధం ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకే బీజేపీ, బీఆరెస్ డ్రామాలాడుతున్నారని, బీజేపీ, బీఆరెస్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందన్నారు రేవంత్ రెడ్డి.

YES9 TV