ఎన్డీఏతో బంధంపై పవన్ ఏం చెప్పారు – అర్దం అవుతోందా..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించారు. పెడన సభలో ఎన్నో ఇబ్బందులు ఉన్న ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు.

టీడీపీకి జనసేన కలిస్తేనే జగన్ ను ఓడించగలుతామని చెప్పారు. దీంతో, ఎన్డీఏ నుంచి పవన్ బయటకు వచ్చారని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు పవన్ దీని పైన క్లారిటీ ఇచ్చారు. పథకాల అమలు పైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు.

ఎన్డీఏలో ఉన్నా..లేకున్నా: వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలనేది చాలా కాలంగా చంద్రబాబు, పవన్ ఆలోచన. ఈ మేరకు పవన్ ప్రయత్నాలు చేసారు. చంద్రబాబు నేరుగా హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. కానీ, బీజేపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఈ సమయంలోనే పవన్ చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిసి..ఆ వెంటనే పొత్తు ప్రకటించారు.

తాను బీజేపీ నేతలకు తన నిర్ణయం వెనుక కారణా లను వివరిస్తానని చెప్పారు. కానీ, బీజేపీ నేతలతో పవన్ కలవలేదు. ఈ సమయంలోనే టీడీపీ, జనసేన పొత్తు..అధికారంలోకి వస్తాయంటూ చెబుతున్న పవన్ ఎక్కడా బీజేపీ ప్రస్తావన చేయటం లేదు. పెడన సభలోనూ ఎన్డీఏ..టీడీపీతో తన బంధం గురించి చేసిన కామెంట్స్ తో ఇక బీజేపీతో బంధం ముగిసినట్లేనని ప్రచారం సాగింది.

బయటకు వస్తే చెబుతా: ఇప్పుడు పవన్ ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయే నుంచి జనసేన బయటకు వచ్చేసిందని వైసీపీ ప్రచారం చేస్తోందన్నారు. బయటకు రావాలనుకుంటే తానే చెబుతానని.. మీకు బాధ అవసరం లేదంటూ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనకు ప్రధానమంత్రి ఆఫీసు ఫోన్‌ నంబరు, అమిత్‌షా, జేపీ నడ్డాల ఫోన్‌ నంబర్లు తెలుసని చెప్పారు.

తాను ఎన్డీయేలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. టీడీపీ నాయకులకు చెబుతున్నాను… గతం మర్చిపోయి జనసైనికులను పిలిచి మాట్లాడండని సూచించారు. అలాగే రాష్ట్రాభివృద్ధి కోసం జనసైనికులు, వీరమహిళలు…టీడీపీ నాయకులతో సహకరించాలని పవన్ కోరారు. ఇదే సమయంలో సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు.

బీజేపీ నిర్ణయం ఏంటి: తనకు స్వాగతం పలికిన మహేశ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, రాంచరణ్‌, మెగాస్టార్‌, రజనీకాంత్‌ అభిమానులందరికీ పవన్ ధన్యవాదాలు చెప్పారు. టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చిన నెలలోపు లిక్కర్‌పై పెంచిన ధరలు రద్దు చేసి పాత ధరలకే క్వాలిటీ మందు అందించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ పైన పవన్ తన విమర్శలను కొనసాగించారు.

బీజేపీ నాయకత్వం పవన్ చేస్తున్న వ్యాఖ్యలు..టీడీపీతో మైత్రి పైన సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అవుతున్నారు. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

YES9 TV