ఉక్రెయిన్ తో పోరు మొదలుపెట్టి ఏడాది దాటిపోయినా ఇంకా ఫలితం తేలకపోవడంతో రష్యాపై ముప్పేట విమర్శలు పెరుగుతున్నాయి. దీంతోపాటే రష్యాలోనూ అసంతృప్తి పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో నిన్న ఉక్రెయిన్ నగరం ఖార్కివ్ పై ఒక్కసారిగా రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో దాదాపు 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అక్కడితో ఆగకుండా రష్యా ఇవాళ ఒక శక్తివంతమైన కొత్త వ్యూహాత్మక క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.
దీనికి కొనసాగింపుగా మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా అణు పేలుళ్లతో కూడిన ఆయుధ పరీక్షలను నిర్వహించే అవకాశాన్ని తోసిపుచ్చలేమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దీంతో రష్యా మరోసారి తమ అణ్వస్త్ర సామర్ద్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.గతంలో సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్నప్పుడు పోగేసుకున్న అణ్వస్త్రాలే తప్ప ఆ తర్వాత రష్యా అణు పరీక్షలు నిర్వహించలేదు. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లు పుతిన్ మాటల్ని బట్టి అర్ధమవుతోంది.
అణుశక్తితో నడిచే, అణు సామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి బ్యూరేవెస్ట్నిక్ను రష్యా విజయవంతంగా పరీక్షించిందని పుతిన్ తొలిసారి ప్రకటించారు. రష్యా తన కొత్త తరం అణ్వాయుధాలలో మరొక కీలకమైన సర్మత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థపై పనిని దాదాపు పూర్తి చేసిందని విశ్లేషకులు, పాత్రికేయుల వార్షిక సమావేశంలో పుతిన్ చెప్పారు. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించింది. ఆ తర్వాత అణు దాడులపై పుతిన్ పలుమార్లు హెచ్చరికలు చేశారు.
అలాగే పాశ్చాత్య దేశాలు రష్యాపై అణు దాడి చేసే అవకాశాలపైనా పుతిన్ తాజాగా స్పందించారు. రష్యాపై ఎవరూ అణుదాడి చేయాలనుకోరని, ఒకవేళ అణుదాడి జరుగుతుందని ముందుగా గుర్తిస్తే మాత్రం మన క్షిపణులు వందల కొద్దీ గాలిలో కనిపిస్తాయని, ఒక్క శత్రువు కూడా బతికుండదని పుతిన్ హెచ్చరించారు. సోవియట్ యూనియన్ పతనానికి ముందు సంవత్సరం 1990 నుండి రష్యా అణు పరీక్షను నిర్వహించలేదు. అయితే పుతిన్ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
