మహిళా ఎమ్మెల్యేపై ఓ బీజెపి ఎంపీ ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. బాధ్యతయుతమైన స్థానంలో ఉండి, ఓ బహిరంగ సభలో ఆయన చేసిన వికృత చేష్టలు అందరినీ విస్మయానికి గురిచేసాయి.
ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్ పక్క సీటులో ఉన్న మహిళా ఎమ్మెల్యేపై అనుచితంగా ప్రవర్తించిన తీరును, అక్కడే ఉన్న వారు వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది.
ఎంపీ వెకిలి చేష్టలు : సెప్టెంబర్ 25న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని శ్రీరామ్ బాంక్వెట్ హాల్ కోల్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ సతీష్ గౌతమ్ హాజరయ్యారు. అయితే, ఆయన తన పక్కనే కూర్చుని ఉన్న మహిళా ఎమ్మెల్యేపై చేతులు వేయడం, ఆమెను ఆసభ్యకరంగా తాకడంతో ఆమె ఇబ్బందిపడ్డారు. చేతులు తాకుతూ, భుజంపై చేయి వేస్తూ మహిళా ఎమ్మెల్యేపై ఎంపీ వెకిలీగా ప్రవర్తించారు. అయితే ఆమె అనంతరం అక్కడి నుండి సీటు మార్చుకుని వేరే కుర్చీలో కూర్చున్నారు.
పలువురు నాయకులు : ఈ కార్యక్రమానికి రవాణా మంత్రి దయాశంకర్ సింగ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్, మాజీ మేయర్ శకుంతలా భారతి, బీజేపీ కార్యవర్గ సభ్యురాలు పూనమ్ బజాజ్, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు విజయ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంతమందిలో అందరూ చూస్తుండగానే ఎంపీ ఈ విధంగా ప్రవర్తించారు. ఆ సమావేశంలో అంత మంది నేతలు ఉన్నా ఎంపీ సతీశ్ గౌతమ్ ఈ విధంగా ప్రవర్తించడం తీవ్ర వివాదాస్పదం అయ్యింది.
తీవ్ర విమర్శలు : చాలా మంది ప్రముఖులు గౌతమ్ చర్యలను అసభ్యకరమని ఖండించారు. ఎంపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీ చేసిన పనికి సదరు మహిళా ఎమ్మెల్యే తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే పట్లనే ఈ విధంగా ప్రవర్తిస్తే ఇక సామాన్య కార్యకర్తలు, జనం సంగతి ఏంటని ప్రశ్నించారు కొందరు. ఒక బహిరంగ కార్యక్రమంలో ఎమ్మెల్యేకే ఇలా వేధింపులు తప్పకపోతే సామాన్య మహిళలు, బాలికలు సురక్షితంగా ఉంటారా అని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు సమాజానికే అవమానమని పేర్కొన్నాయి ప్రతిపక్షాలు.
