మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నవదీప్ నార్కోటిక్స్ పోలీసుల విచారణ

హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నవదీప్ నార్కోటిక్స్ పోలీసుల విచారణ ముగిసింది. డ్రగ్స్ విక్రయించే రాంచందర్ తో ఉన్న సంబంధాలపై ప్రధానంగా ఆరా తీసినట్లు సమాచారం.

శనివారంరోజున సమారు 6 గంటలపాటు నవదీప్‌ను నార్కోటిక్స్ పోలీసులు విచారించారు.

విచారణ అనంతరం నవదీప్ మాట్లాడుతూ.. తానెప్పుడూ.. ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంకు చెందిన రాంచంరద్‌తో పరిచయం మాత్రమే ఉందని, అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ కొనుగోలు చేయలేదని నవదీప్ స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు ఇచ్చినందుకు విచారణకు వచ్చినట్లు తెలిపారు.

డ్రగ్స్ కేసులో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఎస్పీ సునీతా రెడ్డి నేతృత్వంలో నార్కోటిక్ బృందాలు బాగా పనిచేస్తున్నాయని నవదీప్ ప్రశంసించారు. గతంలో ఒక పబ్‌ను నిర్వహించినందుకు పిలిచి విచారించారని.. గతంలో సిట్, ఈడీ విచారించిందని, ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు.

నార్కోటిక్ అధికారులు అడిగిన అన్ని వివరాలకు సమాధానాలు ఇచ్చానని చెప్పారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని అధికారులు చెప్పారని నవదీప్ తెలిపారు. కాగా, నవదీప్‌ను సుమారు 6 గంటల పాటు విచారించిన నార్కోటిక్‌ బ్యూరో అధికారులు.. ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్ లిస్ట్ ముందుంచి.. నవదీప్‌ నుంచి పలు సమాచారం రాబట్టారు. ఇక, వాట్సాప్ చాటింగ్‌ను రిట్రీవ్ చేయనున్న అధికారులు.. డాటా అందిన తర్వాత మరోసారి నవదీప్‌ను విచారించే అవకాశం ఉంది.

నవదీప్ ఫోన్ డేటా డిలీట్ చేశారు: ఎస్పీ

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతా రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. శనివారం నవదీప్‌ను విచారించామన్నారు. తాము అడిగిన ప్రశ్నలన్నింటికీ నవదీప్ సమాధానం చెప్పారని తెలిపారు. నవదీప్ నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, నవదీప్ ఫోన్ డేటాను డిలీట్ చేశారని.. ఫోన్ రిట్రైవ్ చేసిన తర్వాత నవదీప్ ను మరోసారి విచారణకు పిలుస్తామని ఎస్పీ తెలిపారు.

కాగా, మాదాపూర్ డ్రగ్స్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు నవదీప్ (Navdeep) విచారణకు హాజరుకావాలని నార్కోటిక్ బ్యూరో గురువారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 23న విచారణకు హాజరుకావాలంటూ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు నార్కోటిక్ అధికారులు.

అయితే, అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఇటీవల జారీ చేసిన బెయిల్ రద్దవడంతో.. పోలీసులు నవదీప్‌ను ప్రశ్నించారు.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయించే రాంచందర్‌తో నవదీప్‌కు ఉన్న పరిచయాలపై నార్కోటిక్ పోలీసులు ఆధారాలు సేకరించారు. వాట్సాప్ చాటింగ్ తోపాటు కాల్ డేటాను సేకరించారు. దీని ఆధారంగా నవదీప్‌ను పోలీసులు ప్రశ్నించారు.

కాగా, సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్‌లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. కాగా, టాలీవుడ్ దర్శకుడి అరెస్టుతో మళ్లీ మొదలైన డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. ఇటీవల మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిలో ముగ్గురు నైజీరియన్లు ఉన్నారు. నైజీరియన్లు ఆమోబీ, మైఖేల్, థామస్, సినీ దర్శకుడు సుశాంత్ రెడ్డి, ఇండస్ట్రీతో సంబంధం ఉన్న రాంచందర్, దేవరకొండ సురేశ్ రావు, ఖమ్మం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సందీప్, శ్రీకర్ కృష్ణప్రణీత్‌లను నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అరెస్ట్ చేసింది.

 

YES9 TV