చంద్రబాబును అరెస్ట్ చేసిన చోటే దీక్ష చేసి తీరుతాం: భూమా అఖిలప్రియ

చంద్రబాబు అరెస్టుపై ఏపీ రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి ఆయనను జైలుకు పంపించిన విషయం తెలిసిందే.

చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత నుండి ఏపీలో టిడిపి నేతలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్యలో భాగమని మండిపడుతున్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చంద్రబాబు పై పెట్టిన కేసును ప్రభుత్వం విత్ డ్రా చేసుకోవాలని, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని, దీనిపై సభా వేదికగా చర్చించాలని టిడిపి సభలో ఇష్యూ ని లేవనెత్తింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఆందోళన చేపట్టింది. దీంతో సభలో గందరగోళం చోటు చేసుకోగా, టిడిపి ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.

ఇక నేడు అసెంబ్లీలో జరిగిన వ్యవహారం పై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేస్తే అసెంబ్లీలో చర్చ జరగకూడదని వైసిపి చూస్తుందని భూమా అఖిలప్రియ ఆరోపించారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగుతుందని భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.

నంద్యాలలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్న భూమా అఖిలప్రియ వాస్తవాలు తెలుసుకోకుండానే చంద్రబాబు ని అరెస్ట్ చేశారు అంటూ మండిపడ్డారు. కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ అన్నారు కదా ఏమైంది అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టిడిపి నేతలపై కేసులు పెట్టడానికే ప్రభుత్వం పని చేస్తుందా అంటూ నిలదీసిన భూమా అఖిలప్రియ మంత్రులు చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

కొందరు పోలీసులు చంద్రబాబుని అరెస్టు చేయడంలో అత్యుత్సాహం చూపించారని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ ఆళ్లగడ్డకు, నంద్యాలకు మాత్రమే సంబంధించిన విషయం కాదని, రాష్ట్రానికి సంబంధించిన విషయం అన్నారు భూమా అఖిలప్రియ. నంద్యాలలో చంద్రబాబుని అరెస్టు చేసిన చోటే నిరాహార దీక్ష చేస్తామని ఆమె వెల్లడించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే ఎస్పీ కార్యాలయం వద్ద దీక్ష చేపడతామని భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.

Posted Under AP
Editor