ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం జమిలి ఎన్నికల వైపు నిర్ణయం తీసుకుంటే..ఏపీలోనూ ఎన్నికలు ముందుగానే జరిగే అవకాశం ఉంది.

ఇదే అంశాన్ని స్వయంగా సీఎం జగన్ నేరుగా మంత్రులతో ప్రస్తావించారు. అటు చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఈ సమయంలోనే టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. దీంతో..బీజేపీ కోసం వేచి చూస్తూనే..ఈ రెండు పార్టీల అధినేతలు ఎన్నికలు కసరత్తు ప్రారంభిస్తున్నారు.

బీజేపీ నిర్ణయం పై ఉత్కంఠ : ఏపీలో చాలా కాలంగా టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని అందరూ భావించారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత రాజమండ్రి జైలు వద్దే పవన్ ఈ రెండు పార్టీల పొత్తు అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో బీజేపీ తమతో కలిసి రావాలని..వస్తుందని పవన్ ఆకాంక్షించారు. ఇప్పటి వరకు బీజేపీ నుంచి స్పందన లేదు.

ప్రస్తుతం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో..పూర్తయిన వెంటనే పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. తాను టీడీపీతో పొత్తు ప్రకటనకు కారణాలను వివరించటంతో పాటుగా..బీజేపిని కలిసి రావాలని కోరనున్నారు. ఆ సమయంలో బీజేపీ ముఖ్యుల నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా పవన్ ఎన్డీఏలో కొనసాగటం పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ముందస్తు ఎన్నికల ప్రచారంతో : ఇప్పటికే జనసేన నుంచి పొత్తుల సమన్వయ బాధ్యతను పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కు పవన్ అప్పగించారు. సీట్లు..అభ్యర్దులు..రెండు పార్టీలు కలిసి ఎన్నికల వరకు నిర్వహించాల్సిన ఉమ్మడి పోరాటాలు..ఒక పార్టీకి మరో పార్టీ మద్దతుగా నిలవటం వంటి అంశాలను మనోహర్ పర్యవేక్షిస్తారని పవన్ స్పష్టం చేసారు. మనోహర్ అధ్యక్షతన ఇందు కోసం ఒక కమిటీ ఏర్పాటు కానుంది.

బీజేపీ వైఖరి పైన స్పష్టత వచ్చిన తరువాత ఇది రెండు పార్టీల పొత్తుగా ఉంటుందా.. మూడు పార్టీల కూటమిగా వెళ్లాల్సి ఉంటుందా అనేది స్పష్టత రానుంది. బీజేపీ కలిసి వస్తే మూడు పార్టీల నుంచి నేతలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలనే అలోచనలో ఉన్నారు. ఇదే సమయంలో ముందుగా టీడీపీ నుంచి ఒక కమిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సమన్వయ బాధ్యతలు : టీడీపీ అధినేత చంద్రబాబును జైలులో కలిసిన సమయంలో జనసేనతో సమన్వయ బాధ్యతలను పర్యవేక్షించాలని పార్టీ సీనియర్ నేత యనమలకు అధినేత సూచించినట్లు సమాచారం. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత యనమల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు కానుందని సమాచారం.

పార్టీ సీనియర్ నేతగా సమన్వయం..నిర్ణయాల వ్యవమారంలో యనమల సీనియార్టీ కలిసి వస్తుందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. సీట్ల విషయంలో అంతిమంగా చంద్రబాబుదే ఫైనల్ అయినా.. పార్టీ పరంగా చర్చల్లో మాత్రం యనమల బాధ్యత తీసుకొనే అవకాశం ఉంది. దీంతో ఇద్దరు స్పీకర్లుగా పని చేసిన యనమల…నాదెండ్ల మనోహర్ కు చంద్రబాబు..పవన్ ఈ సమన్వయ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

Posted Under AP
Editor