హైదరాబాద్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే.
ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.
గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న తుమ్మల నాగేశ్వరరావు.. తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్లో తనకు సహకరించిన వారికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. శనివారం సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే, తుమ్మలకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తుమ్మల గతంలో ప్రాతినిథ్యం వహించిన పాలేరు టికెట్ కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఈ రెండు స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి, మరో నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వెంకట్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ వెంట ఉన్న కొద్ది మందిలో జిట్టా బాలకృష్ణ ఒకరని కోమటిరెడ్డి చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తామన్నారు.
సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభకు 10 లక్షలకుపైగా జనం వస్తారని కోమటిరెడ్డి చెప్పారు. తాను తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. కేసీఆర్ దళితబంధు పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లాగా మాయమాటలు చెబితే తాము 2014లోనే అధికారంలోకి వచ్చేవాళ్లమని కోమటిరెడ్డి చెప్పారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని జిట్టా బాలకృష్ణ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజల బతుకులు మారలేదన్నారు. కేసీఆర్ సర్కారును బొందపెట్టడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.
