అత్యాధునిక సౌకర్యాలతో ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే దూరం తక్కువగా ఉండాలన్నదే ఈ రైళ్ల తయారీ వెనక ఉన్న ఉద్దేశం.
అయితే ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో మొదట్లో ఉన్నంత ఆదరణ తర్వాత ఉండటంలేదు. వందేభారత్ సగటు వేగం కేవలం 83 కిలోమీటర్లే ఉంటోంది.
వందే భారత్ కన్నా దేశ రాజధానికి ప్రయాణం చేస్తే సూపర్ ఫాస్ట్ రైళ్లు వేగంగా వెళతాయనే అభిప్రాయంలో ప్రయాణికులున్నారు. ఇతర రైళ్లతో పోలిస్తే ఈ వేగంతో గమ్యానికి అనుకున్న సమయంకన్నా ముందుగా ఏమీ చేరుకోవడంలేదని, 40 నిముషాల నుంచి గంటలోపే తేడా ఉంటోందని.. దీనికి అంత డబ్బులు పోసి టికెట్లు కొనుగోలు చేయడం వృథా అనే భావనకు ప్రయాణికులు వచ్చేశారు.
దీంతో భారతీయ రైల్వే కొత్తగా వందే సాధారణ్ రైళ్లను పరిచయం చేయబోతోంది. గతంలో శతాబ్ది రైళ్లు వచ్చినప్పుడు కూడా ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే ఫిర్యాదు రావడంతో జన శతాబ్దిని ప్రవేశపెట్టారు. వీటిల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయి. అలాగే వందే భారత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు రావడంతో వందే సాధారణ్ రైళ్లను ప్రవేశపెట్టబోతోంది.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ రైలు కోచ్లు తయారవుతున్నాయి. 24 ఎల్హెచ్బీ కోచ్లను వందే సాధారణ్ లో ఏర్పాటు చేయనున్నారు. బయో వాక్యూమ్ టాయిలెట్స్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఛార్జింగ్ పాయింట్స్, సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ వంటి ఫీచర్లను రూపొందిస్తున్నారు. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే ఈ రైలు వేగం ఎక్కువగా ఉండటంతోపాటు తక్కువ స్టాపుల్లోనే ఆగనుంది. వందే సాధారణ్ తయారీకి ఒక్కో రైలుకు రూ.100 కోట్లు అవుతున్నట్లు అంచనా.
