ఢిల్లీలో ఇండియా కూటమి స్టీరింగ్ కమిటీ భేటీ-సీట్ల లెక్క తేలిపోతుందా ?

చ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో జట్టు కట్టిన ఇండియా కూటమి ఇవాళ మరో భేటీ కాబోతోంది. ఢిల్లీలో ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ తొలిసారి సమావేశమవుతోంది.

ఢిల్లీలోని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి కూటమి స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరవుతున్నారు. ఇందులో ప్రధానంగా రెండు అంశాలపై చర్చ జరగబోతోంది.

ఇవాళ జరిగే ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీలో ముఖ్యంగా వివిధ పార్టీల మధ్య, వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇప్పటికే తమిళనాడుతో పాటు మహారాష్ట్ర, బీహార్లోనూ కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయినట్లే. దీంతో మిగతా రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై కమిటీ చర్చించబోతోంది. ఇందులో ఢిల్లీ, పశ్చిమబెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాలున్నాయి. వీటిలో సీట్ల పంపకాలు కూటమి ఐక్యతకు సవాల్ గా మారబోతున్నాయి.

అలాగే వచ్చే ఎన్నికల కోసం ఉమ్మడి ప్రచారం ప్రారంభించే అంశంపైనా ఇవాళ కూటమి సమన్వయ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ముఖ్యంగా కూటమిని ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయా పార్టీలు ప్రతిపాదిస్తున్నాయి. దీంతో ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలను ఇవాళ కమిటీ ఖరారు చేసే అవకాశముంది. దీంతో పాటు ఉమ్మడి ర్యాలీలు కూడా నిర్వహించాలని భావిస్తున్నాయి. మొత్తం మీద ఇండియా కూటమి పేరు జనాల్లోకి పంపాలన్నది వీరి ఉద్దేశంగా ఉంది.

మరోవైపు ఇండియా కూటమి సీట్ల పంపకాలు మొదలైన తర్వాత ఇందులో పార్టీల మధ్య లుకలుకలు బయటపడతాయని అధికార ఎన్డీయే కూటమి ఆశలు పెట్టుకుంది. అందుకు అవకాశం ఇవ్వకుండా సాఫీగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలనేది ఇండియా కూటమి ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో సీట్ల పంపకాలపై ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రకటనలతో కాంగ్రెస్ ఇరుకున పడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ భేటీలో సీట్ల పంపకాలపై తీసుకునే నిర్ణయాలు కీలకం కాబోతున్నాయి.

Editor