ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టు అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.
తనను అరెస్టు చేయడం అక్రమమని, రిమాండ్ రిపోర్టు కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీంతో స్పందించిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగాల్సి ఉంది. ఈ లోపు హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో జస్టిస్ శ్రీనివాసరెడ్డి ధర్మాసనం విచారణ ప్రారంభించింది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమయం కోరారు. దీంతో ఈ కేసు విచారణ వారం రోజుల పాటు వాయిదా పడింది.
చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టులో ఆయన లాయర్లు కస్టడీ పిటిషన్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో సీఐడీ న్యాయవాదులు కూడా సమయం కోరడంతో హైకోర్టు వారం రోజుల పాటు విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తదుపరి విచారణ జరపకుండా ఆదేశాలు జారీ చేసింది.
అంతకుముందు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ లో తనను ఈ కేసులో అరెస్టు చేయడం, రిమాండ్ కు పంపడం అక్రమమని లాయర్లు వాదించారు. అలాగే ప్రజాప్రతినిధులకు ఈ కేసు వర్తించదని, ఇందులో సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు కూడా చెల్లదని తెలిపారు. దీనిపై సీఐడీ వెంటనే స్పందించేందుకు ముందుకు రాలేదు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరింది. దీంతో హైకోర్టు కూడా చేసేది లేక విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. దీంతో వచ్చే సోమవారం వరకూ అంటే 19వ తేదీ వరకూ చంద్రబాబు జైల్లోనే ఉండబోతున్నారు.
